హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): టీకాల పంపిణీల విషయంలో తెలంగాణతోపాటు పలు రాష్ర్టాలపై వివక్ష చూపుతున్న కేంద్రం దాన్ని కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు లెక్కలు విడుదలచేసింది. అడిగింది కొండంత… ఇచ్చింది గోరంత అయితే.. దానికి మసిపూసేందుకు సోషల్ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నది.కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ట్విట్టర్లో అవాస్తలు వెల్లడించి అభాసుపాలయ్యారు. దేశంలో ఆదివారంనాటికి 12.56 కోట్ల టీకాలు వేసినట్టు చెప్పిన ఆయన.. ఇంకా అన్ని రాష్ర్టాల్లో కలిపి 2.24 కోట్ల డోసులు మిగిలి ఉన్నట్టు వెల్లడించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తెలంగాణలో 10.48 లక్షల డోసులు ఉన్నట్లు అబద్ధపు ప్రచారానికి తెరలేపారు. ఒకవైపు రాష్ట్రంలో టీకాలు లేవని వైద్యారోగ్య ఆదివారం వ్యాక్సినేషన్ నిలిపివేసింది. ఆదివారం రాత్రి పంపిస్తున్న 2.7 లక్షల డోసులు రెండోడోసువారికి మాత్రమే సరిపోతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలో పెద్దమొత్తంలో నిల్వలు ఉన్నట్లు అవాస్తవాలు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిజానికి శనివారం సాయంత్రం వరకు 90 వేల డోసులు మాత్రమే ఉన్నాయి. ఇవి అత్యవసరంగా రెండోడోసు వారి కోసం నిల్వ ఉంచారు. వైరస్ నుంచి ప్రజలను రక్షించాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం రోజుకు లక్షమందికిపైగా టీకాలు వేస్తున్నది. దీన్ని రెండు లక్షలకు తీసుకువెళ్లాలనే లక్ష్యంతో పని చేస్తున్నది. ఇందుకు కొరత ఉండకుండా చూడాలని వచ్చే 15 రోజుల అవసరం నిమిత్తం 30 లక్షల డోసులు పంపాలని సీఎస్కేంద్రానికి లేఖ రాశారు. నాలుగు లక్షల డోసులను మాత్రమే కేంద్రం పంపింది. వీటిని మూడు రోజులపాటు పంపిణీ చేయగా, మళ్లీ కొరత మొదలైంది.
కిషన్రెడ్డిపై విమర్శల వెల్లువ…
కేంద్ర మంత్రి ట్విట్టర్ వేదికగా చేసిన తప్పుడు ప్రకటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తెలుగు రాష్ర్టాలవారు కేంద్ర మంత్రిని అదే వేదికగా నిలదీస్తున్నారు. రెండు రాష్ర్టాలు వ్యాక్సిన్లు లేక అల్లాడుతుంటే, తప్పుడు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గుజరాత్, పశ్చిమబెంగాల్కు ఎక్కువగా టీకాలు ప్రధాని పంపిణీ చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్న కిషన్రెడ్డి, రాష్ర్టానికి వ్యాక్సిన్లు తీసుకొచ్చేందుకు ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు.