న్యూఢిల్లీ: అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్.. ఇండియాకు 5 కోట్ల కోవిడ్ టీకాలను అమ్మే అవకాశాలు ఉన్నాయి. దీని గురించి భారత ప్రభుత్వంతో ఆ సంస్థ చర్చిస్తున్నది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో ఆ టీకాలు సరఫరా అయ్యే ఛాన్సు ఉన్నది. ప్రస్తుత మార్కెట్లో ఫైజర్ వ్యాక్సిన్ ధర ఎక్కువగా ఉన్నది. అయితే కేవలం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకే ప్రభుత్వం ఫైజర్ టీకాలను కొనుగోలు చేయాలని చూస్తున్నది. వ్యాక్సిన్ల కొరత ఉన్న నేపథ్యంలో .. కొన్ని రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్తున్న విషయం తెలిసిందే.
అమెరికాలో ప్రస్తుతం ఫైజర్, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ దేశం ఆ రెండు టీకాలను ఇతర దేశాలకు ఇచ్చేందుకు ఇంకా సుముఖంగా లేదు. అమెరికాలో పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ జరిగిన తర్వాతనే.. ఇతర దేశాలకు టీకాలను అమ్మేందుకు ఆ దేశం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.