హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజేశేఖర్ రెడ్డి హయాంలో జరిగిన నీటి దోపిడీనే ఏపీ సీఎం వైఎస్ జగన్ కొనసాగిస్తున్నారని వారి అడుగు జాడల్లోనే ఆయన నడుస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. కృష్ణా నది నీళ్ల వాడకంపై కేంద్రాన్ని, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వ తీరును ఆయన అభిశంసించారు. ప్రస్తుత నీళ్ల సమస్యకు ఏపీ ప్రభుత్వ వైఖరే కారణమన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని ఏపీ నిరాకరించిందన్నారు.
ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 203ని ఉపహసంహరించుకోవాలన్నారు. కృష్ణా నది నీళ్లను పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తరలించుకుపోయేందుకు ఉద్దేశించిందే ఈ జీవో నంబర్ 203. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్దమన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా, గోదావరి నదుల్లో తన హక్కు వాటాగా ఉన్న నీటిని వినియోగించుకునేందుకేనని మంత్రి తెలిపారు.
ఉమ్మడి నిధులతో ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టింది ఎవరూ? ఎడమ కాలువకు అన్యాయం చేసింది ఎవరూ? ఎడమ కాలువకు ఆపరేషన్ రూల్స్ ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాలో 15 లక్షల మంది వలసలు పోయేందుకు సీమాంధ్ర పాలకులే కారణమన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ విజృంభణకు కారకులు వారేనన్నారు. ఆంధ్రా సర్కార్ తీరు చూస్తుంటే ఆకతాయి తనం గుర్తుకు వస్తోందన్నారు. పక్క రాష్ట్రాలు స్నేహహస్తం చాచినా ఫలితం దక్కలేదన్నారు. అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారు. ముమ్మాటికి నీళ్ల లెక్క తేల్చాల్సిందేనన్నారు. ఉద్యోగుల, ఆస్తుల లెక్కల్లోనూ విభజన జరగాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు.