నల్లగొండ: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ విజయం ఖాయం అని, టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో విజయదుందుభి మోగిస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా దక్కవని చెప్పారు. నిడమనూరు మండలంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు భాస్కర్ రావు, మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్తో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నదని విమర్శించారు. సీఎం కేసీఆర్ రేయింబవళ్లు ప్రజల సంతోషం కోసమే పనిచేస్తున్నారని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తేనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని వెల్లడించారు. టీఆర్ఎస్ అంటే సంక్షేమం, అభివృద్ధి, స్వపరిపాలన అని చెప్పారు. మరికొద్ది రోజుల్లో అర్హులందరికి వారి సొంత స్థలాల్లో ఇళ్లని నిర్మిస్తామని తెలిపారు. దీనికోసం బడ్జెట్లో రూ.11 వెల కోట్లు కేటాయించారని పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి జానారెడ్డి జాడలేకుండా పోతాడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నోముల భగత్కు భారీ మెజార్టీ వస్తుందని చెప్పారు. ప్రచారంలో భాగంగా గ్రామాల్లో తిరుగుతుంటే సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా తమకు ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. పల్లెల్లో ఎక్కడచూసినా పచ్చని పొలాలు దర్శమిస్తున్నాయని వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందని, అధికార పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. భగత్ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటాడని పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..