న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి నాలుగో దశ తీవ్ర ఆందోళన రేపుతున్నది. ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోయాయి. ఈ నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆదివారం లేఖ రాశారు. దేశ రాజధానిలో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని తెలిపారు. బీజేపీ పాలనలోని మూడు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల (ఎంసీడీ) ఆసుపత్రుల్లో కనీసం 7 వేల పడకలు కరోనా రోగులకు కేటాయించాలని కోరారు. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఉన్నదని, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా వీటి గురించి మాట్లాడినట్లు తెలిపారు.
మరోవైపు కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలనుద్దేశించి ఆదివారం మాట్లాడారు. కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. గత 24 గంటల్లో పాజిటివ్ కేసుల రేటు 24 నుంచి 30 శాతానికి పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రులలోని పడకలు కరోనా రోగులతో నిండిపోతున్నాయని తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం వంద కంటే తక్కువగా ఐసీయూ పడకలు ఉన్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ఆక్సిజన్ వ్యవస్థలతో కూడిన ఆరు వేలకుపైగా పడకలను అందుబాటులోకి తెస్తామని కేజ్రీవాల్ తెలిపారు. యమునా స్పోర్ట్స్ కాంపెక్స్, కమన్వెల్త్ గేమ్స్ విలేజ్, ఛతర్పూర్లోని రాధా సోమి సత్సంగ్ బియాస్లో కరోనా కేంద్రాలను తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. వారాంత కర్ఫ్యూకు సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
కాగా, ఆనంద్ విహార్, షకుర్ బస్తీ రైల్వే స్టేషన్ వద్ద లాజిస్టికల్ సపోర్ట్, మెడికల్ స్టాఫ్ , ఆక్సిజన్ సదుపాయాలతో అత్యవసర ప్రాతిపదికన కోవిడ్ పడకలను ఏర్పాటు చేయాలని రైల్వేను ఢిల్లీ ప్రభుత్వం కోరింది. గత ఏడాది మాదిరిగా 5,000 పడకల స్థాయి వరకు సౌకర్యాలను కల్పించాలని రైల్వేను అభ్యర్థించింది.