నల్లగొండ : ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు చేపట్టే ఏ పథకాన్ని కానీ, తమ ప్రభుత్వ పనులను కానీ అడ్డుకునే శక్తి కోమటిరెడ్డి బ్రదర్స్కు లేదని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తేల్చిచెప్పారు. తాను కన్నెర్ర జేస్తే కోమటిరెడ్డి బ్రదర్స్ బతుకులు బజారున పడుతాయన్నారు. ఇప్పటి వరకు ఎవ్వరి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడలేదు.. తన జోలికి కానీ, ప్రభుత్వ పథకాల జోలికి కానీ వస్తే ఇక ఊరుకునే ప్రసక్తే లేదని మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
సూర్యాపేటలో మంత్రి జగదీశ్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధును అడ్డుకునేందుకు శతవిధాలా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయాలు గడించిన కోమటిరెడ్డి బ్రదర్స్.. నేడు పిచ్చి ప్రేలాపణలు చేస్తూ.. పేదల కడుపు కొడుతున్నారని ధ్వజమెత్తారు. పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి ఉనికిని కాపాడుకునేందుకు.. ఆక్రోశంతో తన మైక్ను లాక్కొని రౌడీయిజం చేశారని మంత్రి పేర్కొన్నారు.