నల్లగొండ : తెలంగాణ విద్యా విధానం యావత్ దేశానికి మార్గదర్శకం కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత శ్రమించాలని ఆయన కోరారు. కరోనాతో విద్యారంగం ఒకింత ఇబ్బంది పడిందన్నారు.
నల్లగొండ జిల్లా పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘానికి (పీఆర్టీయూ) ఎన్నికైన నూతన కమిటీ మంగళవారం హైదరాబాద్లో మంత్రి జగదీష్ రెడ్డిని కలిసింది.
ఈ సందర్భంగా నూతన కమిటీని మంత్రి జగదీష్ రెడ్డి అభినందించారు. కరోనా వంటి పరిస్థితులను అధిగమించి విద్యార్థులకు విద్యానందిస్తున్న ఉపాధ్యాయులను అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం బలోపేతం అవుతుందన్నారు. గురుకులాల ద్వారా అందిస్తున్న విద్య అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న విషయాన్ని గుర్తించాలన్నారు.
పీఆర్టీయూ కమిటీని ఆయన ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, కమిటీ నూతన అధ్యక్షుడు సుంకరి భిక్షం గౌడ్, ప్రధాన కార్యదర్శి కాళం నారాయణ రెడ్డితో పాటు మాజీ ప్రధాన కార్యదర్శులు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి, కోమటిరెడ్డి నరసింహా రెడ్డి, భసిరెడ్డి రవీందర్ రెడ్డి, ఫణికుమార్, మేకల జానారెడ్డి , జేవీ గౌడ్, యూసుఫ్, రమణ తదితరులు పాల్గొన్నారు.