నల్లగొండ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై విమర్శలు చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ‘చెత్తగాళ్లకు వచ్చేదే చెత్త ఆలోచనలే వస్తాయి. జోకర్లు,బ్రోకర్లలా మాట్లాడడం వారి విజ్ఞత. నిర్మాణాత్మక మైన ఆలోచనలు వారికి ఎప్పుడూ రావు. రాజకీయ పార్టీలకు నాయకత్వం వహిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి‘ అంటూ జగదీష్ రెడ్డి కామెంట్స్ చేశారు.
మాట్లాడేటప్పుడు సోయి ఉండాలని, ఎప్పుడన్నా బాధ్యతగా పనిచేస్తే ఆ విషయం తెలుస్తుందని విమర్శించారు. నల్లగొండలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జీవితంలో ఏ ఒక్క రోజు కూడా బాధ్యతాయుతంగా పనిచేసిన చరిత్ర లేని వారికి ఆ విషయం ఏమి తెలుస్తుందని ఎద్దేవా చేశారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నియామకం గురించి కూడా జగదీష్ రెడ్డి మాట్లాడారు.
‘అసలు నీకు పదవి ఎలా వచ్చిందో నీ పార్టీ వారే బహిరంగంగా చెబుతున్నారు. ప్లినరీ విజయవంతం కావడంతో తట్టుకోలేక పోతున్నారు. టీఆర్ఎస్ క్యాడర్లో నూతన ఉత్తేజం చూసి మతిభ్రమించింది. పార్టీ విజయగర్జనతో వాళ్ల మతులు పూర్తిగా దెబ్బ తింటాయి’ అని తేల్చిచెప్పారు.
రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, అద్భుతమైన పాలనా దక్షత ఉన్న పార్టీ టీఆర్ఎస్ అని చెప్పిన ఆయన.. తోబుట్టువుగా, తండ్రిగా, మేనామామగా అందరిలో ఒకరిగా దీవెనలు అందుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. పెద్దాయనను తిడితే పెద్దలు కాలేరని, పెద్దలను అనుకరిస్తేనే పెద్దవాళ్ళం అవుతామని రేవంత్కు హితవు చెప్పారు.
‘పులి వేషం వేస్తే పులులు కారు. చిల్లర మాటలు మానుకోవాలి. ఆ భాష మాకు కూడా వచ్చు. ప్రజల్లో ఏహ్యభావం కలుగుతోందన్నది గమనించాలి. అసెంబ్లీలో చర్చకు సిద్ధం అంటే తోక ముడిచింది ఎవరు?’ అని జగదీష్ ప్రశ్నించారు. పరిపాలన అంటే ఏమిటో తెలుసుకుని మాట్లాడాలని రేవంత్కు చెప్పారు.
‘సీఎండీ ప్రభాకర్ రావు నివేదిక ఎక్కడ ఇచ్చారు? ఏ ఏ అధికారులు ఎక్కడికి పోతున్నారో నీకు చెప్పాలా? పనితీరును పట్టి ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. పాలనా దక్షత ఎలా ఉండాలి అన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి నేర్చుకో. అవాకులు చెవాకులు మానుకో’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.