ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి
రహదారి డివైడర్ మధ్యలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే
పెద్దపల్లిటౌన్, జూన్ 22: తెలంగాణ లోని అన్ని జిల్లాల కంటే ఎక్కువ మొక్క లు నాటి జిల్లాను హరిత పెద్దపల్లిగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని చీకురాయి రోడ్డులో రాజీవ్ రహదారి డివైడర్ల మధ్యలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో హరిత తెలంగాణలో భాగంగా పెద్దపల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో హరితహారం కింద రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని నర్సరీల్లో పెంచిన మొక్కలతోపాటు ఇతర నర్సరీల్లో పెంచిన మొక్కలను తీసుకు వచ్చి విరివిరిగా నాటుతామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజ్మినా సుల్తానా, కౌన్సిలర్లు ఎరుకల కల్పన, వూదరి చంద్రశేఖర్, వునుకొండ సూజాత, నాయకులు ఎరుకల రమేశ్, సునీల్, మొబీన్, సిబ్బంది రామ్మోహన్, రాజు తదితరులు పాల్గొన్నారు.