నల్లగొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి,సుందరీకరణ పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించినందున పనులు పారదర్శకంగా,నాణ్యతగా జరగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతగండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలసి నల్లగొండ పట్టణంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి వల్లభరావు చెరువును సందర్శించారు.వల్లభ రావు చెరువు చుట్టూ ట్యాంక్ బ్యాండ్ ను అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి అన్నారు.
హైదరాబాద్ లోని జల విహార్, నెక్లెస్ రోడ్ లాగా సుందరీకరణ చేయాలని సూచించారు. . అంతే గాకా సందర్శకులు విహరించడానికి హౌస్ బోట్స్, పార్కులను, సీటింగ్ బెంచీలను ఏర్పాటు చేయాలన్నారు. వల్లభరావు చెరువుకు ఇరువైపులా రోడ్లను వేయాలని సూచించారు. అంతే గాక ముక్యంగా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మిస్తున్న ఐ.టి. హబ్ నుండి ఉదయాసముద్రం వరకు కెనాల్ పక్క నుండి రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించారు.
నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కే.సి.ఆర్. ఆదేశాల మేరకు పట్టణంలోని నల్లగొండ మర్రిగూడ బైపాస్ రోడ్డు నుండి క్లాక్ టవర్ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తీ చేస్తున్నట్లు తెలిపారు. మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఫ్లై ఓవర్ కావాలని కోరగానే మంజూరు చేసిన ముఖ్యమంత్రికి అయన కృతజ్ఞతలు తెలియజేశారు. హైదరాబాద్ రోడ్డులో పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఇప్పటికే క్లాక్ టవర్ వరకు రోడ్డు పనులు మధ్యలో సెంటర్ లైటింగ్ సిస్టం, డివైడర్ ల ఏర్పాటు, విద్యుత్ టవర్ల ఏర్పాట్లను ఈ నెల 31వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.