నిర్మల్ అర్బన్, జూలై 15: టీఆర్ఎస్ సర్కారు చేపట్టే పథకాలు, అభివృద్ధిని చూస్తే కొందరికి గిట్టడం లేదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏం పనీపాట లేనోళ్లతో కలిసి ఇటీవల నిర్మల్కు వచ్చి పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ధర్నాలు చేశారని మండిపడ్డారు. నలుగురైదుగురు కార్యకర్తలను వెనుకేసుకువచ్చి రాజకీయ దురుద్దేశంతో ఏది పడితే అది మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేము గుడులు కట్టిస్తున్నామా?, గుళ్లలోని లింగాలను మింగుతున్నామా? అన్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు సౌకర్యాలు పెరిగాయని, నిర్మల్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కనబడుతలేదా? అని ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. అబద్ధ్దాలు మాట్లాడినోళ్ల నాలుక కోస్తామని, సరైన సమయంలో తాము దీటుగా స్పందిస్తామని స్పష్టం చేశారు.