క్యామ్లూప్స్ (బ్రిటిష్ కొలొంబియా), మే 29: చరిత్ర మరిచిపోయిన గాయాలను వర్తమానం తట్టిలేపుతుందని అంటారు. వేలాది మంది చిన్నారుల ఆర్తనాదాలకు కారణభూతంగా నిలిచి, వారి నుదిటన మరణ శాసనాన్ని లిఖించిన ఓ విద్యాలయం గాథ తాజాగా బయటపడింది. కెనడాలోని బ్రిటిష్ కొలొంబియా రాష్ట్రంలో ఉన్న క్యామ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ ఆవరణలో 215 మంది పిల్లల మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో మూడేండ్ల వయసున్న చిన్నారులు కూడా ఉండటం కలిచి వేస్తున్నది. ఈ మృతదేహాల అవశేషాలను రాడార్ సాయంతో గుర్తించామని అమెరికా మూలవాసుల కౌన్సిల్ టెకెమ్లూప్స్ తే సెక్వెపెమ్ ఫస్ట్ నేషన్ చీఫ్ రోసనే రస్మిర్ తెలిపారు. ఇంకా పాఠశాల ఆవరణలో మరిన్ని ప్రాంతాలను పరిశీలించాల్సి ఉన్నదని, ఇంకొన్ని మృతదేహాల అవశేషాలు లభించవచ్చని శుక్రవారం తెలిపారు. ఈ స్కూల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్టు వార్తలు వచ్చాయని, అయితే ఎప్పుడూ ఆధారాలు లభించలేదని ఆమె అన్నారు. ఇలాంటి దుర్ఘటనను ఎవరూ ఊహించలేరని ఆవేదన వ్యక్తం చేశారు.
క్యామ్లూప్స్ ఇండియన్ రెసిడెన్షియల్ స్కూల్ 1890లో ప్రారంభమైంది. అమెరికా మూలవాసుల పిల్లలను క్రైస్తవ మతంలోకి మార్చి కెనడా సొసైటీలోకి చేర్చడమే ప్రధాన ధ్యేయంగా ఈ స్కూల్ని స్థాపించారు. 1.5 లక్షల మంది పిల్లలను ఈ పాఠశాలకు అనుబంధంగా పనిచేస్తున్న స్కూళ్లలో చేర్పించాలని బలవంతపు చర్యలు మొదలుపెట్టారు. మూలవాసుల కుటుంబాల నుంచి వేలాది మంది పిల్లలను బలవంతంగా లాక్కొచ్చి ఈ స్కూల్లో చేర్పించారు. అక్కడ వారి మాతృభాష మాట్లాడటానికి వీల్లేదు. తల్లిదండ్రులను కలువకూడదు. నిబంధనలు అతిక్రమించిన పిల్లలపై దాడులకు పాల్పడేవారు. హింసించే వారు. ఆడ పిల్లలపై లైంగిక దాడులు కూడా జరిగేవి. ఇలా దాదాపు 6 వేల మంది చిన్నారులు మరణించినట్టు అంచనా. వారి మృతదేహాలను స్కూల్ ఆవరణలోని మైదానంలోనే పాతి పెట్టేవారు. 1969 వరకు నడిచిన ఈ స్కూల్ బాధ్యతను కెనడా ప్రభుత్వం తీసుకున్నది. అనంతరం 1978లో ఈ స్కూల్ మూతబడింది.