న్యూఢిల్లీ, మే 1: కరోనా వేళ జరిగిన మినీ ఎన్నికల సమరాంగణం ఫలితాలు ఆదివారం వెలువడనున్నాయి. రణరంగాన్ని స్ఫురణకు తెచ్చేలా.. హింసాత్మక ఘటనలు, ఘాటు విమర్శలతో యావత్ దేశ ప్రజానీకాన్ని తనవైపునకు తిప్పుకున్న పశ్చిమబెంగాల్తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో.. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం (ఈసీ) కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కొవిడ్-19 నిబంధనలను తప్పనిసరి చేసింది. 822 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 2,364 కౌంటింగ్ కేంద్రాలను కనీసం 15సార్లు శానిటైజ్ చేసింది. కేంద్రాల బయట కార్యకర్తలు గుమిగూడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసింది. పోలీసులతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు 1,100 పర్యవేక్షకులను నియమించింది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని ఈసీ అధికారులు తెలిపారు.
కొవిడ్-19 నెగెటివ్ ధ్రువపత్రం లేదా టీకా రెండు డోసులు వేసుకున్నట్టు సర్టిఫికెట్లు చూపిస్తేనే అభ్యర్థులను లేదా ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థితో పాటు ఇద్దరికి మాత్రమే లోపలికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలపై నిషేధం విధించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణలోని నాగార్జన్సాగర్ అసెంబ్లీ స్థానం, ఏపీలోని తిరుపతి లోక్సభ స్థానంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరిగిన అసెంబ్లీ, లోక్సభ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఆదివారమే వెల్లడికానున్నాయి. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. తమిళనాడు(234), అస్సాం(40), కేరళ(140), పుదుచ్చేరి(30)కి కూడా ఎన్నికలు జరిగాయి.
మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకు ఈసీ
కరోనా కేసులు పెరగడానికి ఈసీయే కారణమని, అందుకు ఆ సంస్థపై హత్య కేసు నమోదు చేయాలంటూ ఇటీవల మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు వ్యాఖ్యలు అనుచితంగా, తీవ్రంగా అవమానపరిచేలా, అవహేళన చేసేలా ఉన్నాయని ఈసీ తన పిటిషన్లో పేర్కొంది.