సిద్ధిపేట : నంగునూరు మండలం దర్లపల్లి గ్రామంలో ఆసర్ల యాదయ్య క్షేత్రం వద్ద కొత్తగా నిర్మిస్తున్న చెక్ డ్యాము పనులను గురువారం ఉదయం మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఇరిగేషన్ ఏస్ఈ బస్వరాజ్, ఈఈ గోపాల కృష్ణ, డీఈ చంద్రశేఖర్, ఏఈ ఖాజాలతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అక్కడికక్కడే నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ మేరకు సిద్ధిపేట వాగుపై ఇప్పటికే 27 చెక్ డ్యాములు ఉండగా, దర్గ కొత్త చెక్ డ్యాము కలుపుకుని మొత్తం 28 చెక్ డ్యాములు ఉన్నాయని తెలిపారు. అదే విధంగా నంగునూరు మండలంలోని పెద్ద వాగు-మోయ తుమ్మెద వాగుపై ఇప్పటికే 7 చెక్ డ్యాములు ఉండగా, ఖాతా గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న 2 చెక్ డ్యాములు కలుపుకుని మొత్తం 9 చెక్ డ్యాములు ఉన్నాయని., దీంతో నంగునూరు మండలంలోని వాగు పరివాహక ప్రాంతమంత జీవనదిగా మారనుందని మంత్రి వెల్లడించారు.
జేపీ తండా గ్రామ ఐకేపీ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. నంగునూరు మండలం జెర్రిపోతుల తండా గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోళ్ల కేంద్రాన్ని గురువారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. కోవిడ్ నిబంధనలు పాటించి ధాన్యం కొనుగోళ్లు జరపాలని, ప్రతి ఒక్కరూ కరోనాతో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర నిర్వాహకులు, హమాలీలకు సూచించారు. జేపీ తండా గ్రామ ధాన్యం కొనుగోళ్ల కేంద్రంలో కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని, మూడు రోజుల్లో రూ.1.20 కోట్ల చెల్లింపులు జరిపినట్లు నిర్వాహకులను మంత్రి అభినందించారు. జేపీ తండాలో గతేడాది 3900 క్వింటాళ్లు ధాన్యం పండగా, ఈ యేడు అదనంగా 800 క్వింటాళ్లు ఎక్కువగా పంట ధాన్యం వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ళకు రైస్ మిల్లర్లు, హమాలీలు సహకరిస్తున్నట్లు తెలిపారు.