సిద్ధిపేట: వ్యాక్సిన్ల విషయంలో అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదనే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఢిల్లీ సర్కారు అనాలోచిత, అసందర్భ, తప్పుడు నిర్ణయాలతో దేశ, రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిద్ధిపేటలోని బాలాజీ ఫంక్షన్ హాలులో ఏర్పాటుచేసిన హై రిస్క్లకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రాలకు అవసరమైన వాక్సిన్లను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడం లేదని, కంపెనీలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోనివ్వడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలోనే ఉత్పత్తి అయిన వ్యాక్సిన్ను కూడా మనం కొనుక్కునే పరిస్థితి లేకుండా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తున్నది చెప్పారు. తప్పుల మీద తప్పులు చేస్తూ రాష్ట్రాలను బద్నాం చేసేలా వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. వ్యాక్సిన్లను సకాలంలో పంపిణీ చేయడంలో విఫలమయ్యందని ఆరోపించారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో అనుసరిస్తున్న తప్పుడు నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ల దిగుమతిని సరళతరం చేయడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలే ప్రాధాన్యతా క్రమాలను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలే నేరుగా వ్యాక్సిన్లను కంపెనీలు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం కల్పించాలన్నారు.
కొవాగ్జిన్, కొవీషీల్డ్ టీకాల కొనుగోలుకు ఇప్పటికే ఆయా కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిందని చెప్పారు. రాష్ట్రాలకు కేటాయించే వ్యాక్సిన్లు ఎన్నివ్వాలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కంపెనీలు టీకాలను తెలంగాణకు ఇవ్వలేక పోతున్నాయని విమర్శించారు.
తెలంగాణలో హై రిస్క్ స్కూల్ గ్రూపులకు, ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే వ్యక్తులకు ప్రాధాన్యత క్రమంలో వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. రాష్ట్రంలోని 13 నగర పాలక సంస్థలు, 129 మున్సిపాలిటీల పరిధిలోని కూరగాయలు, పండ్ల విక్రేతలు, మద్యం అమ్మకందారులు, హోటళ్లు, స్మశాన వాటికలు, కిరాణా షాపుల్లో పనిచేసే వ్యక్తులు మొదలైన 8.5 లక్షల మందికి ప్రాధాన్యతా క్రమంలో టీకాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం నేటి నుంచి పది రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్నదని వెల్లడించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఇంటింటి సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కరోనా మూడో దశను కూడా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆ దిశగా ఇప్పటికే ప్రభుత్వ దవాఖానలను బలోపేతం చేసే దిశగా సీఎం చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.