న్యూఢిల్లీ/హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ) అధినేత, కేంద్ర మాజీమంత్రి అజిత్సింగ్ కరోనాతో కన్నుమూశారు. ఆయన వయస్సు 82 ఏండ్లు. గత నెల 20వ తేదీన ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన గురుగ్రామ్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా మహమ్మారి ఉద్ధృతి కారణంగా అజిత్సింగ్ అంత్యక్రియలను ఢిల్లీలోనే కొవిడ్ నిబంధనలను పాటిస్తూ నిర్వహించనున్నారు. తన తండ్రికి నివాళి తెలుపాలనుకొనే ఎవరైనా ఇంటి నుంచే తెలుపాలని, అదే ఆయనకు, కరోనాపై యుద్ధం చేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు ఇచ్చే గొప్ప గౌరవం అని అజిత్ సింగ్ కుమారుడు జయంత్సింగ్ కోరారు.
మాజీ ప్రధాని చరణ్సింగ్ కుమారుడైన అజిత్సింగ్ రైతుల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేశారు. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతు సమస్యలపై గళం విప్పారు. జాట్ తెగకు చెందిన అజిత్సింగ్ యూపీలో కీలక నేతగా ఎదిగి జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2003లో వరంగల్లో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభకు అప్పటి ఎన్డీయే ప్రభుత్వంలో కేంద్ర వ్యవసాయమంత్రిగా ఉన్న అజిత్ సింగ్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖను రాశారు.
ఐఐటీ ఖరగ్పూర్ పూర్వ విద్యార్థి
అజిత్సింగ్ 1939 ఫిబ్రవరి 12న మీరట్లో జన్మించారు. లక్నో యూనివర్సిటీ, ఐఐటీ ఖరగ్పూర్, అమెరికాలోని ఇల్లినాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకొన్నారు. 1980 ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 1986లో మొదటిసారి రాజ్యసభకు ఎన్నికయ్యా రు. ఆరుసార్లు ఎంపీగా గెలిచారు. 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో పరిశ్రమలశాఖ మంత్రిగా, యూపీఏ హయాంలో పౌరవిమానయాన మంత్రిగా విధులు నిర్వర్తించారు.
రైతుల దేవదూత
అజిత్ సింగ్ మృతిపట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోదీ కాంగ్రెస్ నేతలు రాహుల్గాంధీ, ప్రియాంక యూపీ సీఎం యోగి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, పంజాబ్ సీఎం అమరీందర్సింగ్ తదితరులు సంతాపం ప్రటించారు. అజిత్ సింగ్ రైతుల కోసం అంకితభావంతో పనిచేశారని గుర్తుచేసుకొన్నారు. రైతుల ప్రయోజనాల కోసం గళం వినిపించడంలో ఆయన ముందుండేవారని రాష్ట్రపతి కోవింద్ అన్నారు. అజిత్ సింగ్ను ‘రైతుల దేవదూత’గా అమరీందర్సింగ్ అభివర్ణించారు. రైతుల సంక్షేమం కోసం ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. అజిత్సింగ్ మరణంతో జాతీయ రాజకీయాల్లో శూన్యం ఏర్పడిందని, దానిని ఎవరూ పూడ్చలేరని పేర్కొన్నారు.
ఆత్మీయున్ని కోల్పోయాం: వినోద్కుమార్
అజిత్సింగ్ మరణంతో తెలంగాణ ఒక ఆత్మీయున్ని కోల్పోయిందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బీ వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమానికి అజిత్ సింగ్ మొదటి నుంచి అండగా నిలిచిన గొప్ప వ్యక్తి అని ఆయన తెలిపారు. అజిత్సింగ్ మృతి పట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, హరీశ్రావు, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వేముల ప్రశాంత్రెడ్డి, జగదీశ్రెడ్డి, సంతాపం తెలియజేశారు. ‘ఆర్ఎల్డీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నాప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంత్రి హరీశ్ ట్వీట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత సంతాపం
అజిత్సింగ్ మరణం పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన వెల కట్టలేని సేవలు అందించారన్నారు. అజిత్సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ఉద్యమానికి అండ..దండ
అజిత్సింగ్ తొలి నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నారు. 2001 నుంచి మొదలు రాష్ట్రం ఏర్పడే నాటి వరకు ఆయన ఉద్యమసారథి కేసీఆర్ తరఫున జాతీయస్థాయిలో తెలంగాణాకు వకాల్తా పుచ్చుకొని మాట్లాడేవారు. టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని కాంక్షిస్తూ చేపట్టిన అనేక బహిరంగసభల్లో, పార్టీ నిర్వహించిన సదస్సుల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆర్ఎల్డీ తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ప్రకటించడంతోపాటు పార్లమెంటు వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై అనేక పార్టీలను చైతన్యం చేశారు. కేసీఆర్తో కల్సి జాతీయ స్థాయి పార్టీల నేతలను కూడా కలిశారు. తమ పార్టీ చిన్నరాష్ర్టాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలమని ఆయన ప్రకటించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఆయన ఇక్కడి అభివృద్ది, సంక్షేమకార్యక్రమాల గురించి ఎంపీగా పనిచేసిన బోయినపల్లి వినోద్కుమార్ తదితరులను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ మరువదు: సీఎం కేసీఆర్
అజిత్సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అజిత్సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని గుర్తుచేసుకొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సీఎం అన్నారు. తండ్రి చరణ్సింగ్ వారసత్వాన్ని అజిత్సింగ్ సమర్థంగా కొనసాగించారని, రైతు నేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని సీఎం అన్నారు. అజిత్ సింగ్ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.