మెదక్ : కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగించిందని, జిల్లాలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగానికి, పోలీసులకు సహకరించవలసినదిగా రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు నాలుగు గంటల పాటు లాక్ డౌన్ సడలింపు ఉండగా చాల మంది ప్రజలు ఉదయం 8 గంటల తరువాత ఒక్కసారిగా నిత్యావసర సరుకులు, కూరగాయలకై బయటికి వస్తున్నారు. దీంతో జన సమూహం పెరుగుతున్నదని, కాబట్టి ఉదయం 6 గంటలకే సరుకులకై బయటికి వెళ్లాలని అన్నారు. ఇంటి నుండి ఒక్కరే వెళ్లాలని, వారం రోజులకు సరిపడా సరుకులు ఒకే సారి తెచ్చుకోవాలని సూచించారు.
అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దని, లేకపోతె మార్కెట్లో రద్దీ పెరిగి కరోనా వ్యాప్తి చెందే అవకాశముంటుందని అన్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడంతో పాటు సమాజాన్ని కాపాడినవారవుతారని , ప్రభుత్వానికి సహాకరించిన వారవుతారని, కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే బయటికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, తరచూ చేతులను శుభ్రపరచుకోవాలని మంత్రి సూచించారు.
అదేవిధంగా జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో రెండు ఆటోలు పెట్టి పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా ఒక కుటుంబం నుండి ఒక్కరు మార్కెట్ కు వస్తే తిరిగి ఇదు రోజుల తరువాతే నిత్యావసర సరుకులకై మళ్ళి బయటకు రావాలని, కరోనా వ్యాప్తిని అరికట్టుటకు సహకరించ వలసినదిగా విజ్ఞప్తి చేస్తూ వార్డు వారిగా ప్రచారం చేయాలని మునిసిపల్ చైర్మన్ లకు సూచించారు. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో 10 దాటినా తరువాత బయట తిరిగితే ఫైన్ వేస్తామని ప్రజలలో అవగాహన కల్పించాలని డీఎస్పీ కృష్ణ మూర్తికి సూచించారు. సైకిల్ మోటార్పై ఒక్కరే వెళ్లాలని, ఆటోలో ముగ్గురు మించి ప్రయాణించరాదని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు మాస్క్ లేకుండా బయట తిరిగిన సుమారు నాలుగు వేల మంది నుండి 35 లక్షల రూపాయల ఫైన్ వసూలు చేశామని డీఎస్పీ తెలిపారు.