సిద్దిపేట : దుబ్బాక నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వల భూసేకరణపై సిద్దిపేట కలెక్టరేట్లో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్ల కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 3 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిధులతో విద్యుత్, మురుగునీటి కాల్వల నిర్మాణం, తాగునీరు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. జులై 10వ తేదీ లోపు ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ ఇండ్ల ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. లబ్దిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలు అందాలంటే డిస్ట్రిబ్యూటరీ కాల్వల నిర్మాణం తప్పనిసరి అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దుబ్బాక నియోజవర్గంలో ప్రధాన సాగునీటి కాల్వల నిర్మాణం ఇప్పటికే పూర్తి చేశామని తెలిపారు. కాల్వల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించి వారు స్వచ్చందంగా ముందుకు వచ్చేలా చూడాలి. రాజకీయాలకు అతీతంగా సమిష్టిగా కాల్వల భూ సేకరణకు ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలి. తరాలుగా నిలబడే కాల్వల నిర్మాణ గొప్ప కార్యంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ముందుండి పని చేయాలి అని హరీష్ రావు పిలుపునిచ్చారు.