పూరి జగన్నాథ్ కెరీర్ మొదలుపెట్టి 20 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇప్పటివరకూ తన వర్కింగ్ స్టైల్ ఏ హీరో కోసం మార్చుకోలేదు ఈయన. అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నా.. అల్లు అర్జున్ ఉన్నా.. మహేష్ బాబు అయినా ఎవరైనా కూడా పూరి పనిచేసే తీరు మాత్రం మారదు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ కోసం తనను తాను మార్చుకుంటున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్.
ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు పూరి జగన్నాథ్. హిందీలో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తుండటం గమనార్హం. అక్కడ కూడా భారీగానే విజయ్ దేవరకొండ లైగర్ సినిమాను విడుదల చేస్తున్నారు.
పైగా ఈ సినిమా కోసం 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వరస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండపై ఇంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు వర్కవుట్ అవుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి.
ఇదంతా ఇలా ఉంటే తన స్టైల్ కు భిన్నంగా ఈ సినిమాను చాలా నెమ్మదిగా తెరకెక్కిస్తున్నాడు. ఏ సినిమా అయినా కూడా ఆరు నెలల్లో పూర్తి చేసే పూరి.. విజయ్ దేవరకొండ సినిమా కోసం మాత్రం ఏడాదిన్నర తీసుకున్నాడు. మధ్యలో కరోనా బ్రేక్ పక్కన పెట్టినా కూడా విజయ్ సినిమా కోసం ఎక్కువ సమయం తీసుకున్నాడు. బహుశా ఆయన కెరీర్లో ఇంత టైం తీసుకొని చేస్తున్న సినిమా ఇదే కావచ్చు.
ఇందులో కంటెంట్ కూడా అలాగే ఉంటుందంటున్నాడు పూరీ జగన్నాథ్. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో జోడీ కట్టింది. ఇప్పటికీ షూటింగ్ 60 శాతం మాత్రమే పూర్తయింది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సెప్టెంబర్ 9న లైగర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేవలం పూరికి మాత్రమే కాదు.. విజయ్ దేవరకొండకు కూడా ఈ సినిమా విజయం కీలకంగా మారింది. ఏదేమైనా ఇంత జాగ్రత్తగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లైగర్ ఎలా ఉండబోతుందో చూడాలి.