సిద్దిపేట : కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని సిద్దిపేట పట్టాభి రామాలయంలో మంత్రి హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన రామాలయం. సిద్దిపేట ఊరు పుట్టినప్పుడు ఈ పట్టాభి రామాలయం నిర్మించారని పురాణాల్లో చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఏడాది అత్యంత వైభవంగా ఈ ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం జరుగుతందన్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది కేవలం అర్చకులు మాత్రమే ఈ వేడుకలను నిర్వహించారని, భక్తులను అనుమతించలేదని తెలిపారు. రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు అన్ని దేవుళ్లు ఆశీర్వాదాలు ఉండాలన్నారు. రాష్ర్ట ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ త్వరగా కోలుకొని పరిపాలనా కొనసాగించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించామని తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దేవాలయాలకు సీఎం కేసీఆర్ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఆలయాల అభివృద్ధికి నిధులు కూడా కేటాయిస్తున్నారని చెప్పారు. యాదాద్రిని అత్యంత వైభవంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ పట్టాభి రామాలయం పునర్ నిర్మాణం కోసం రూ. 2 కోట్ల 10 లక్షల నిధులు మంజూరు చేసుకున్నట్లు తెలిపారు. అభివృద్ధికి మారుపేరుగా సిద్దిపేట నిలిచిందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు.