మెదక్ : మెదక్ పట్టణంలో రూ. నాలుగున్నర కోట్ల వ్యయంతో నిర్మించనున్న సమీకృత వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ సముదాయానికి, రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వైకుంఠధామానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, క్యాంపు ఆఫీసు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన నిర్మాణాన్ని నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎస్పీ కార్యాలయం పనులు నెమ్మదిగా కొనసాగుతున్నందున కాంట్రాక్టర్ను తొలగించి, వారం రోజుల్లో షార్ట్ టెండర్లు పిలవాలన్నారు. ఏడెనిమిది నెలల్లో ఈ పనులు పూర్తయ్యేలా చూడాలని పోలీసు శాఖ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ను హరీష్ రావు ఆదేశించారు. స్థానిక పీఎన్ఆర్ ఇండోర్ స్టేడియంలో రూ. 5 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన వుడెన్ బ్యాడ్మింటన్ కోర్టును మంత్రి ప్రారంభించారు.
జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు ప్రజలకు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. మెదక్లో వెయ్యి, నర్సాపూర్లో 800, తుప్రాన్లో 800, రామాయంపేటలో 300 డబుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఆ నివాస సముదాయాలకు విద్యుత్ సౌకర్యం, మంచి నీటి సౌకర్యం కల్పించి, శ్రావణ మాసంలో ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, ఇంజినీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీష్, ఎస్పీ చందన దీప్తి, అదనపు కలెక్టర్ జీ రమేశ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ సీఈవో శైలేష్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, డీఏం అండ్ హెచ్వో వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.