సిద్ధిపేట : చిన్నకోడూర్ మండలం చౌడారం గ్రామంలో రూ.3.53 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మతో కలిసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఇవాళ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. చౌడారం గ్రామానికి డబుల్ లేన్ బ్రిడ్జీ తేవడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. గ్రామాన్ని దశల వారీగా మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ వానాకాలానికి రైతుబంధు కింద 60 లక్షల 57 వేల 197 మంది రైతులకు రూ. 7178 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతు ఎక్కడికీ తిరగకుండా పెట్టుబడి సాయం ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కరోనాతో ఇబ్బంది ఏర్పడినప్పటికీ, రైతులకు రైతుబంధు మాత్రం కచ్చితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ కోసం నెలకు రూ. వెయ్యి కోట్లు ప్రభుత్వం చెల్లిస్తున్నది అని గుర్తు చేశారు.
ఏడేండ్ల కింద 24 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం పండితే, ఈ యేడు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇదంతా కాళేశ్వరం జలాలతో సాధ్యమైంది అని మంత్రి స్పష్టం చేశారు. రైతులకు మేలు చేకూరాలన్నదే సీఎం కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయం అని తేల్చిచెప్పారు. ఆయిల్ ఫామ్, మల్బరీ తోటలు-పట్టు సాగు, వరి సాగు విరివిగా చేపట్టాలని చౌడారం గ్రామ రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నెత్తిమీద కుండలా రంగనాయక సాగర్ ఉన్నదని, పది తరాలు బాగుండాలంటే.. ప్రతీ గ్రామంలో కాల్వలు యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు సహకరించాలని రైతులను మంత్రి హరీష్ రావు కోరారు.