గోల్నాక, జూన్ 30 : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. బుధవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో ఉన్న పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. దీంతో పాటు కొత్తగా ఏఏ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్లు ఏర్పాటు చెయ్యాలో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ సుధాకర్, సంతోష్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, జలమండలి ఏఈ రోహిత్ తదితరులు పాల్గొన్నారు.