సిద్దిపేట : సిద్దిపేట జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రి హరీష్ రావు పరామర్శించి, ఆత్మీయంగా పలుకరించారు. అన్నం పెడుతున్నారా.. వసతులు ఎలా ఉన్నాయ్.. మంచిగా చూసుకుంటున్నారా.. అంటూ కొవిడ్ బాధితులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. మీకేం కాదు.. ధైర్యంగా ఉండండి.. తాను ఉన్నానంటూ వారిలో హరీష్ రావు మనోధైర్యం నింపారు.
కోవిడ్ చికిత్స విధానాన్ని పరిశీలించేందుకు, కోవిడ్ పేషెంట్లకు భరోసానిచ్చి, ధైర్యం నింపేందుకు బుధవారం సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంత్రి హరీష్ రావు సందర్శించారు. పీపీఈ కిట్ ధరించకుండానే కొవిడ్ వార్డుల్లో తిరిగారు మంత్రి. కొవిడ్ కష్టకాలంలో వైద్య సిబ్బంది అందిస్తున్న సేవలు గొప్పవి అని మంత్రి కొనియాడారు. వైద్యాధికారులు, డాక్టర్లు, నర్సులు, సిబ్బంది సేవలను హరీష్ రావు ప్రశంసించారు.