సిద్దిపేట : రైతులకు సకాలంలో రుణాలు అందించాలని, రైతుబంధు, ఫించన్లు, పంట రుణాల్లో కోత విధించొద్దని బ్యాంకర్లకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా ములుగు హార్టికల్చర్ యూనివర్సిటీలో యూనియన్ బ్యాంకు బ్రాంచ్ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, యూనియన్ బ్యాంకు ఫీల్డ్ జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య, రీజనల్ మేనేజర్ జి శంకర్ లాల్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నీరజతో పాటు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత 17 నెలలుగా కరోనా విపత్కర పరిస్థితుల్లో దేశ, రాష్ట్ర ప్రజానీకం కొట్టుమిట్టాడుతున్న దృష్ట్యా పేద మధ్యతరగతి ప్రజలకు రుణాలు అందిస్తూ బ్యాంకులు ఆదుకోవాలని కోరారు. రైతు బంధు, ఆసరా పెన్షన్ లబ్దిదారులకు ఇబ్బందులు కలగకుండా బ్యాంకర్లు సహకరించాలని కోరారు. త్వరలో ఫారెస్ట్ కళాశాలను ఫారెస్ట్ యూనివర్సిటీ చేసే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తెలిపారు. ఫారెస్ట్ కళాశాల విద్యార్థుల సౌలభ్యం కోసం ఉపయోగపడేలా బ్యాంకు సేవలు అందించాలన్నారు. యూనివర్సిటీ ఆవరణలో వాహనదారుల కోసం రోడ్డు ప్రక్కన ఏటీఎం ఏర్పాటుకు అధికారులు సహకరించాలన్నారు.
కార్పొరేషన్ బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనమైన తర్వాత మొదటి బ్రాంచ్ను సిద్దిపేట జిల్లా హార్టికల్చర్ యూనివర్సిటీలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంకు వర్గాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇప్పటి వరకు లక్షా 51 వేల బిజినెస్ చేపట్టినట్లు, దేశంలో 5వ స్థానంలో, తెలంగాణ రాష్ట్రంలో 2వ స్థానంతో యూనియన్ బ్యాంకు సేవలు అందిస్తున్నదని మంత్రికి బ్యాంకు అధికారులు వివరించారు. అంతకు ముందు ఉద్యానవన యూనివర్సిటీ ఆవరణలో హరీష్ రావు మొక్కలు నాటారు.