న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 4 కోట్లకు పైగా డొక్కు వాహనాలు (కాలపరిమితి ముగిసిన) రోడ్లపై తిరుగుతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ వెల్లడించింది. వీటిలో దాదాపు సగం వాహనాలు రోడ్లపైకి వచ్చి 20 ఏండ్లు దాటిందని తెలిపింది.
కాలపరిమితి ముగిసిన వాహనాలు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో 70 లక్షల వాహనాలతో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో ఉన్న యూపీలో 15 ఏండ్లు నిండిన వాహనాలు 56.54 లక్షలు ఉన్నాయి. వీటిలో 24.55 లక్షల వాహనాలు 20 ఏండ్లు పైబడినవే. ఈ పాత వాహనాలన్నింటిపై కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రతిపాదించిన హరిత పన్నును విధించాలని యోచిస్తున్నది.
ఈ మేరకు వాహనాల వివరాలను డిజిటైజ్ చేసి రాష్ర్టాలకు సమాచారం అందించింది. అయితే తెలుగు రాష్ర్టాలతో పాటు మధ్యప్రదేశ్, లక్షదీవులకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదని పేర్కొన్నది.