మహబూబ్నగర్, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిరుద్యోగులను రెచ్చగొట్టి బీజేపీ ఓట్లు అడుగుతున్నదని ఆర్అండ్బీశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. ఎన్నికలొచ్చాయంటే రెచ్చగొడుతూ.. ప్రశాంతతకు భంగం కలిగించే పార్టీలపట్ల యువత అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం మహబూబ్నగర్ టీఆర్ఎస్ కార్యాలయంలో మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తో కలిసి ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం నిర్వహిస్తున్న మహిళలంతా తమ సోదరి వాణీదేవికి ఓటేసి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే 1.32 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని.. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సన్నద్ధంగా ఉన్నదన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు చెప్పాలని డిమాండ్చేశారు.
ప్రశ్నించే గొంతుక అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని.. ప్రశ్నించే వాళ్లు కావాలో, పరిష్కారం చూపే వాళ్లు కావాలో పట్టభద్రులు ఆలోచించుకోవాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న రాంచందర్రావు ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్లో అడ్వకేట్లు అడిగితే ఎమ్మెల్సీగా ఉండి ఒక వాటర్ ఫిల్టర్ కూడా ఇవ్వలేకపోయాడని ఎద్దేవాచేశారు. సమస్యలను పరిష్కరిస్తానని ఓట్లేయించుకుని.. గెలిచిన తర్వాత తిరిగి చూడలేదని మహబూబ్నగర్ న్యాయవాదులు రాంచందర్రావును నిలదీశారని గుర్తుచేశారు. తల్లికి గంజి పోయనోడు.. చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తామన్న తీరున బీజేపీ ప్రవర్తిస్తున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, డీసీసీబీ వైస్ చైర్మన్ వెంకటయ్య, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
కేంద్రంలో అధికారం వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ.. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ లక్షలాది మందిని రోడ్డున పడేస్తున్నాడని మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని చెప్పారు. మహిళలపై అపారమైన గౌరవంతోనే సీఎం కేసీఆర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి వాణీదేవికి టిక్కెట్ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్సీగా వాణీదేవిని గెలిపించాలని కోరారు.