సిద్దిపేట : గ్రామాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోందని రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు.. హైదరాబాద్లో కూర్చొని మాట్లాడితే సరిపోదు.. గ్రామాలలో వచ్చి చూస్తే అభివృద్ధి ఏమిటో మీ ముఖాలకు తెలుస్తుందని హరీష్ రావు అన్నారు.
గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నడూ లేని విధంగా అహ్మదీపూర్ గ్రామంలో రూ.6.25 కోట్ల నిధులతో 14 రకాల అభివృద్ధి పనులు ప్రారంభించుకున్నాం అని తెలిపారు. తెలంగాణ రావడం, కేసీఆర్ సీఎం కావడంతో అహ్మదీపూర్ దశ, దిశ మారిపోయిందన్నారు. కాంగ్రెస్ హయాంలో కాలిపోయిన మోటార్లు, పేలిపోయిన ట్రాన్స్ ఫార్మర్లు దర్శనమిచ్చేవి. ఇప్పుడు ఆ సమస్య లేదన్నారు. కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ నిండు కుండలా తయారైందన్నారు. తైలంగాణ రైతాంగానికి కేసీఆర్ ఒక భరోసానిచ్చారు. మరో రెండు నెలల్లో మల్లన్న సాగర్ నీళ్లు అందిస్తామన్నారు. వచ్చే నెల నుంచి 57 ఏండ్ల వయసు దాటిన వారందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తామని హరీష్ రావు పేర్కొన్నారు.