రామగిరి, జూన్ 25 : పాఠశాలల ప్రారంభానికి ముందే పాఠ్యపుస్తకాల సరఫరా మొదలైంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తుగానే పంపిణీ ప్రారంభించగా శుక్రవారం ఆర్టీసీ కార్గో బస్సుల్లో జిల్లా కేంద్రంలోని బుక్ డిపోకు చేరుకున్నాయి. పుస్తకాలను అతి త్వరలోనే మండల కేంద్రాలకు సరఫరా చేయనున్నారు. నల్లగొండ జిల్లాలో వివిధ యాజమాన్యాల పరిధిలో 1,659ప్రభుత్వ పాఠశాలలున్నాయి. 1నుంచి 10వ తరగతుల్లో 1,76,296మంది విద్యార్థులున్నారు. నల్లగొండ జిల్లాకు 6లక్షలపైగా పుస్తకాలు అవసరం కాగా ఇప్పటికే 45వేల పుస్తకాల స్టాకు ఉన్నది. తాజాగా మరో లక్షకుపైగా చేరుకున్నాయి. లాక్డౌన్ కారణంగా సరఫరా ఆలస్యమైందని అధికారులు తెలిపారు. శనివారం నుంచి అన్ని పుస్తకాలు అందనున్నట్లు పేర్కొన్నారు. యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలకు 30శాతం పుస్తకాలు ఇప్పటికే చేరుకున్నాయి.
అన్ని పుస్తకాలపై బార్కోడ్..
పాఠ్యపుస్తకాలు పక్కదారి పట్టకుండా ప్రతి పుస్తకానికీ ఆధార్ లింక్ బార్ కోడ్ ప్రింట్ చేశారు. పాఠశాలల నుంచి సేకరించిన యూడైస్ వివరాల ఆధారంగా నంబరింగ్ ఇచ్చారు. దీంతో విద్యార్థులందరికీ పుస్తకాలు అందే అవకాశం ఉన్నది. ‘జిల్లాకు అవసరమైన పుస్తకాలు అన్నీ త్వరలోనే చేరుకుంటాయి. వీటిని తిరిగి ఎంఆర్సీలకు చేరవేసి అక్కడి నుంచి విద్యార్థుల రాక ప్రారంభం కాకముందే పాఠశాలలకు చేరుస్తాం’ అని డీఈఓ భిక్షపతి తెలిపారు.
తెరుచుకున్న పాఠశాలలు
ప్రభుత్వ ఆదేశాలతో పాఠశాలలు శుక్రవారం తెరుచుకున్నాయి. ఉపాధ్యాయుల రాకతో సందడి వాతావరణం ఏర్పడింది. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించారు. జూలై 1నుంచి విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో సంసిద్ధతా కార్యక్రమాల నిర్వహణకు ప్రధానోపాధ్యాయులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. శుక్రవారం నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 2,260మంది వ్యాక్సిన్ తీసుకున్నట్లు డీఈఓ బి.భిక్షపతి తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను డీఈఓ, ఆయా ప్రాంతాల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించారు.