లండన్, ఏప్రిల్ 16: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో భారీ కుంభకోణానికి పాల్పడిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ (50)కి ఉచ్చు బిగిసింది. ఆ బ్యాంక్ను దాదాపు రూ.14,500 కోట్లకు మోసగించి 2018లో విదేశాలకు పారిపోయిన నీరవ్ను భారత్కు అప్పగించేందుకు బ్రిటన్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వుపై బ్రిటన్ హోం శాఖ మంత్రి సంతకం చేసినట్లు ఆ దేశంలోని భారత సీనియర్ దౌత్యాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత్కు వచ్చిన తర్వాత నీరవ్ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో 12వ బ్యారక్కు తరలించనున్నట్లు సమాచారం.
నీరవ్కు 14 రోజుల గడువు
అయితే బ్రిటన్ హోం మంత్రి ఉత్తర్వును నీరవ్ న్యాయపరంగా సవాలు అవకాశం లేకపోలేదు. ఇందుకు సంబంధించిన అనుమతి కోసం ఆయన 14 రోజుల్లోగా దరఖాస్తు చేసుకునే వీలున్నది. పీఎన్బీ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ ప్రస్తుతం లండన్ నైరుతి ప్రాంతంలోని వాండ్స్వర్త్ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు. ఈ కుంభకోణంపై నీరవ్ భారత న్యాయస్థానాలకు సమాధానం చెప్పాల్సిందేనని వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఫిబ్రవరి 25న తేల్చిచెప్పింది. కానీ, ఆయన అప్పగింతకు సంబంధించిన ఉత్తర్వు జారీచేసే అధికారాన్ని బ్రిటన్ క్యాబినెట్ మంత్రికే వదిలేసింది. భారత్కు అప్పగిస్తే తనకు న్యాయం జరగదని, వైద్యపరమైన అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నీరవ్ చేసిన వాదనను కోర్టు కొట్టిపారేసింది. భారత్కు అప్పగిస్తే నీరవ్కు అన్యాయం జరుగుతుందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని, మానవ హక్కుల విషయంలోనూ నీరవ్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
రెండేండ్ల సుదీర్ఘ పోరాటం
పీఎన్బీ కుంభకోణంలో తొలుత నీరవ్, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ సహా 25 మంది నిందితులుగా చేర్చారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లోని కొందరు అధికారులతో నీరవ్ కుమ్మక్కై మోసపూరిత అండర్టేకింగ్ లెటర్లతో పీఎన్బీని దారుణంగా మోసగించారని ఆ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో 2018 జనవరి 31న కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కేసు నమోదు చేసింది. అదే ఏడాది మే 14న తొలి చార్జిషీట్ను, 2019 డిసెంబర్ 20న రెండవ చార్జిషీట్ను దాఖలు చేసింది. రెండవ చార్జిషీట్లో మరో ఐదుగురిని నిందితులుగా చేర్చడంతో మొత్తం నిందితుల సంఖ్య 30కి పెరిగింది. కానీ పీఎన్బీ కుంభకోణంపై కేసు నమోదు కావడానికి 30 రోజుల ముందే (2018 జనవరి 1న) నీరవ్, మెహుల్ చోక్సీ విదేశాలకు పలాయనం చిత్తగించారు. దీంతో వారిని స్వదేశానికి రప్పించేందుకు భారత అధికారులు రెండేండ్ల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం సాగిస్తున్నారు.
2027 వరకు ఆంటిగ్వాలోనే చోక్సీ
నీరవ్, చోక్సీలను త్వరలో భారత్కు రప్పించడం ఖాయమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నెలలో స్పష్టం చేశారు. ప్రస్తుతం మెహుల్ చోక్సీ కరీబియన్ దీవుల్లో నక్కాడు. అక్కడ ఆయన పొందిన పౌరసత్వాన్ని రద్దు చేసినట్లు గతేడాది చివర్లో వార్తలు వెలువడటంతో ఆంటిగ్వా అండ్ బార్బుడా ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) స్పందించింది. పౌరసత్వం రద్దు వ్యవహారంపై చోక్సీ న్యాయ పోరాటానికి దిగాడని, ఈ కేసు పరిష్కారమయ్యేందుకు కనీసం 7 ఏైండ్లెనా పడుతుందని అక్కడి అధికారులు తెలిపారు. 2027 వరకు ఆయన భారత్కు తిరిగొచ్చే అవకాశాలు లేవని వారు చెప్పారు.
ఇవీ కూడా చదవండీ…
ఒక్కసారి శానిటైజ్.. 35రోజులు రక్షణ
పెద్దమ్మగడ్డలో కానరాని సీసీ కెమెరాలు
యాదాద్రిలో శాస్ర్తోక్తంగా లక్ష్మీపూజలు