ఇల్లందకుంట: ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంటలో స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు బ్యాంక్ లింకేజీ, స్త్రీ నిధి రుణాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్, మంచినూనె ధరలను బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచిందని విమర్శించారు. భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదెవరో ప్రజలు ఆలోచించాలని సూచించారు. ఆసరా పెన్షన్, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పనికిరానివని ఈటల అంటున్నాడని విమర్శించారు. కొంత మంది బొట్టుబిల్లలు, గడియారాలు ఇచ్చి మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు.
పేదింటి ఆడపిల్ల పెళ్లికి టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష 116 ఇస్తున్నదని మంత్రి హరీశ్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానలను బాగుచేసి కేసీఆర్ కిట్లు అందిస్తున్నరని తెలిపారు. ప్రభుత్వమే దవాఖానకు తీసుకొచ్చి ప్రసవం చేయించి మళ్లీ ఇంటి దగ్గర దింపుతున్నదని వెల్లడించారు. చిన్న పిల్లలకు అంగన్వాడీల్లో కోడిగుడ్లు, పౌష్టికాహారం అందిస్తున్నామని చెప్పారు. గురుకులాలు ఏర్పాటు చేసి నాణ్యమైన చదువు చెబుతున్నామన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే రూ.2016 పింఛన్తో వృద్ధులు, వితంతువుల ఆత్మగౌరవం పెంచిందన్నారు. ఇంటింటికి నల్లా నీళ్లిచ్చి ఆడబిడ్డల కష్టాలు తీర్చినమని చెప్పారు. ఉచితంగా నీళ్లు, కరెంటు ఇవ్వడం వల్ల రైతులు పంటలు బాగా పండించారని తెలిపారు. బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చెబుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇల్లందకుంటలో ఒక్కొక్క గ్రూప్కు వడ్డీలేని రుణ సహాయం రూ.లక్షకుపైగా వచ్చిందని చెప్పారు. వడ్డీలేని రుణం కింద రూ.3.14 కోట్లు ఇస్తున్నామని తెలిపారు. ఇల్లందకుండలో ఇప్పటివరకు మహిళా సంఘాలకు భవనం లేదని, 18 మహిళా భవనాలకు రూ.2.36 కోట్లు మంజూరు చేశామన్నారు. మహిళా భవనాలకు అవసరమైన ఫర్నీచర్ కూడా అందజేస్తామని పేర్కొన్నారు. ఇల్లందకుంట మండల సమాఖ్య భవనానికి రూ.50 లక్షలు మంజూరు చేశామన్నారు. ఇల్లందకుంటలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు.