రైతుల కోసం 4 వేలు ఉండే రైతుబంధును 5 వేలు చేస్తా మన్నం.. చేశామా? లేదా?. 50 వేలున్న కల్యాణలక్ష్మి సాయాన్ని లక్ష నూట పదహార్లకు పెంచుతమన్నం.. పెంచినమా.. లేదా?. ఎండాకాలంలోనూ సాగు నీరు ఇస్తామని చెప్పినం.. ఇచ్చినమా? లేదా’?. ధరలు పెంచుడే లక్ష్యంగా సాగుతున్న కేంద్రంలోని బీజేపీ పాలనలో 18 నెలల్లోనే పెట్రోల్ ధరను రూ.36 పెంచింది. ఉప ఎన్నికలు అయిపోంగనే వెయ్యి రూపాయలు ఉన్న గ్యాస్ ధరను మరో 200 పెంచుతది. ప్రజలు ఓటుతో ఉప ఎన్నికలో బీజేపీకి బుద్ధిచెప్పాలి.
జమ్మికుంట చౌరస్తా / జమ్మికుంట రూరల్, అక్టోబర్ 24: దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు ముగియగానే కేంద్రంలోని బీజేపీ సర్కార్ గ్యాస్ ధరలను మళ్లీ రెండు వందలు పెంచుతుందని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. నిత్యావసరాల ధరలు రోజూ పెంచినా బీజేపీ దాహం తీరట్లేదని మండిపడ్డారు. ఈ నెల 30న ఓటేసేందుకు వెళ్లే ముందు ప్రజలు గ్యాస్ సిలిండర్కు మొక్కి టీఆర్ఎస్కు ఓటేసి.. బీజేపీని బొందపెట్టాలని కోరారు. హుజూరాబాద్లో ఈవీఎం మీట నొక్కితే ఢిల్లీ గుండెలు అదరాలని పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట మండలంలోని మాచినపల్లి, వెంకటేశ్వర్లపల్లి జంక్షన్, మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ధూంధాంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీకి కేవలం దింపుడుకళ్లం ఆశ మాత్రమే మిగిలి ఉన్నదని, గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు ఎప్పుడో ఖాయమైపోయిందని చెప్పారు. గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన రైతు చట్టాలకు వ్యతిరేకించి, ఇప్పుడు అదే పార్టీలో ఉన్న ఈటల రాజేందర్.. ఆ నల్ల చట్టాలను సమర్థిస్తున్నట్టేనా అని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెంచి నిరుపేదలపై పెనుభారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వం మెడలు వంచితే గానీ సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు.
బీజేపీ నాయకులవి ఝూటా మాటలు..
ఉప ఎన్నికలో నాలుగు ఓట్ల కోసం బీజేపీ నాయకులు ఝూటా మాటలు చెప్తున్నారని, వాళ్ల మాటలు నమ్మే స్థితిలో హుజూరాబాద్ ప్రజలు లేరని మంత్రి హరీశ్రావు అన్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఏంచేస్తరో చెప్పకుండా, ఎదుటోళ్లను తిట్టుడే బీజేపోళ్లు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అబద్ధాల బీజేపీకి, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న టీఆర్ఎస్కు మధ్యనే పోటీ జరుగుతుందని.. ఎవరు కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. పెట్రోల్, డీజిల్తో ఎవలకు పని ఉంటదని ఇటీవల ఓ కేంద్ర మంత్రి అన్నరు. 95 శాతం మందికి వీటి అవసరమే లేదని మాట్లాడిండ్రు. ఇయ్యాల పెట్రోల్, డీజిల్తో పని లేని రైతు ఉంటడా? అని ప్రశ్నించారు. పోయినేడు ట్రాక్టర్తో ఎకరా దున్నేందుకు 3 వేలు, మొన్నటి వానకాలంల రూ.5 వేలైందని.. ఇప్పుడు యాసంగికి 6 వేలు ఐతదని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డిని తీసుకొచ్చి అబద్ధాలు చెప్పిస్తున్నారని.. దమ్ముంటే గ్యాస్ సిలిండర్ ధరను 500 తగ్గిస్తామని చెప్పి ఓటు అడగాలని సవాల్ విసిరారు. స్వార్థం కోసం బీజేపీలో చేరిన ఈటల గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. గెల్లును గెలిపించుకుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని పునరుద్ఘాటించారు. ఈటల నిర్లక్ష్యంతోనే హుజూరాబాద్లో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మాణం కాలేదని, గెల్లు గెలిచినంక సొంత జాగా ఉన్నవాళ్లకు రూ.5.04 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం నిధులిస్తున్నదని చెప్తున్న బీజేపీ నాయకులు.. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో వాటిని ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు.
ఉద్యమ స్ఫూర్తిని అభివృద్ధిలో చూపిస్తా: గెల్లు
మోచేతులపై, అరచేయి మట్టలపై లాఠీలతో కొట్టి చర్లపల్లి, చంచల్గూడ జైళ్లల్లో వేసినా ఉద్యమాన్ని వదిలిపెట్టలేదని, అదే పట్టుదలతో నియోజకవర్గాన్ని అభివద్ధి చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, రైతుబంధును, రైతుబీమాను పరిగె అని వ్యాఖ్యానించిన ఈటలకు బద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక్క అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వరంగల్ డీసీసీబి చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కరీంనగర్ డీసీసీబి వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
మహిళా రక్షణలో తెలంగాణ టాప్
మహిళల రక్షణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించి, మహిళలకు రాజకీయ ప్రాధాన్యం అందించింది. సీఎం కేసీఆర్ మహిళ రక్షణకోసం ఏర్పాటు చేసిన షీటీమ్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. క్రైం రేటు తగ్గించిన రాష్ర్టాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపుతో ప్రభుత్వం నిర్మాణాత్మకంగా పని చేయడానికి దోహతపడుతుంది. పని చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతునివ్వాలి.
బీజేపీకి ఓటేస్తే నష్టపోతం
బీజేపీకి ఓటేస్తే మనమే నష్టపోతం.. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకోవాలని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని పలు వార్డుల్లో కొప్పుల పర్యటించారు. నమూనా ఈవీఎంను ప్రదర్శిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే దానికి పడదని ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు.
వెన్నుపోటు.. ఈటలకు వెన్నెతో పెట్టిన విద్య
బీజేపీ నేత ఈటల రాజేందర్కు వెన్నుపోటు పొడవడం వెన్నెతో పెట్టిన విద్య. టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకొని తనకు ఓటు వేయాలని ఈటల దళితులకు చెబుతున్నాడు. దళితులకు ఈటల మాదిరి నీచ బుద్ధి లేదు. దళితులు డబ్బులకు అమ్ముడు పోరన్న విషయం ఈటల తెలుసుకోవాలని సూచించారు. దళితుల ఆస్తులను అక్రమంగా గుంజుకొని వేల కోట్లు సంపాదించావని ఈటలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దళితజాతిని సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధిలోకి తేవడానికి కేసీఆర్ దళితబంధుతో రూ.10 లక్షలు ఇస్తుంటే.. నోటికాడ బుక్క రాకుండా నేల పాలు చేశారని ధ్వజమెత్తారు. కోపం ఉంటే వీపు మీద కొట్టుగాని పొట్టపై కొట్టద్దొని హితవు పలికారు. బీజేపీకి, ఈటల రాజేందర్కు ఎన్నికల్లో దళితులు బుద్ధిచెప్తారని పునరుద్ఘాటించారు.