జగిత్యాల : భారతీయ జనతా పార్టీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ కవితతో కలిసి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. నూతనంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ భవన సముదాయాన్ని పరిశీలించారు. తర్వాత జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 7వ తేదీన సీఎం కేసీఆర్ జిల్లా కలెక్టర్ భవనంతో పాటు పార్టీ ఆఫీసును ప్రారంభించే నేపథ్యంలో మంత్రి జిల్లా అధికారులు స్థానిక నాయకులతో సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించి ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. సభ జరిగేటప్పుడు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఈ అమాయకపు తెలంగాణ కాదని.. ఉద్యమాల తెలంగాణ అన్నారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరూ నమ్మరన్నారు. ఆ పార్టీ నేతల యాత్రలు చూస్తుంటే.. టీఆర్ఎస్ పార్టీ మీటింగ్ల వద్ద చివరి వరుసలో ఉండేంత మంది కూడా రావడం లేదని, పాదయాత్రలన్నీ వెలవెలబోతున్నాయన్నారు. ఎన్నికలు వస్తే చాలు ఈడీ, ఐటీ రైడింగ్లు చేస్తుందని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా అక్కడ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.
బీజేపీ పెట్టించే పార్టీలు ఉంటాయని, ఆ పార్టీ వదిలిన బాణాలు సైతం ఉంటాయన్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్లోనో బాణాలు, పార్టీలు, కుట్రలు, ఐటీలు నడిచాయని.. ఉద్యమాల గడ్డపై సాగవని స్పష్టం చేశారు. నాడు ఉద్యమ సమయంలో ఆంధ్రాపాలకులు ఎన్నో కేసులు పెట్టారని, చాలాసార్లు అరెస్టులు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ సాధించామని, ఇవాళ బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టీఆర్ఎస్ తెలంగాణ సమాజం వైపు నిలబడుతుందన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం నిలబడుతామని, ఎక్కడా తలవంచమని, గట్టి పోరాటం చేస్తామని హరీశ్రావు స్పష్టం చేశారు.
బీజేపీకి రాజకీయం, అధికారం ముఖ్యమని మంత్రి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు, అభివృద్ధి ముఖ్యమన్నారు. మాతా మరణాలకు సంబంధించి ఇటీవల కేంద్రం విడుదల చేసిన డేటాలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంటే.. తెలంగాణ మూడోస్థానంలో నిలిచిందని గుర్తు చేశారు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే కేంద్రం తెలంగాణకు ఇక్కటీ ఇవ్వలేదన్నారు. అయినా సీఎం కేసీఆర్ రాష్ట్రానికో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ప్రజలకు వైద్యంతో పాటు విద్యను చేరువ చేస్తున్నారన్నారు.
ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని, మహారాష్ట్రాలోని రెండు, మూడు తాలుక సర్పంచులు వచ్చి మమ్మల్ని తెలంగాణలో కలుపుమని కోరుతున్నారన్నారు. బిజేపీ పాలిత సర్పంచులు వచ్చి వినతిపత్రాలు ఇచ్చారని, తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి పక్క రాష్ట్రాలకు కనిపిస్తున్నని.. ఇక్కడి బీజేపీ నేతలు మాత్రం కళ్లుండి కనబడనికబోదిళ్లా, వినబడి కూడా చెవులు లేనివారిలా మాట్లాడుతున్నారన్నారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి.. ఇవ్వనివి ఇచ్చినట్లు చెబుతున్నారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేంద్రం రాష్ట్రానికి లక్షకోట్ల బకాయిలు పడిందని, 42శాతం ఇచ్చిమాని చెప్పారని.. మీ ప్రకారమే లెక్కిస్తే ఎనిమిదేళ్లలో 32వేలకోట్లు రాష్ట్రానికి రావాలని.. అవి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కిషన్రెడ్డి చాలాసార్లు ఇలాగే మాట్లాడి.. వాస్తవాలు చెబితే నాలుక కరుచుకున్నారన్నారు. జూటా మాటలు చెబుతున్నారని, మీరు ఇచ్చింది తక్కువ కోతలు పెట్టింది ఎక్కువన్నారు. నిజంగా ఇచ్చింది 29.6 శాతం మాత్రమే. 42 శాతం ఇస్తున్నామనే పేరిట అనేక పథకాలు రద్దు చేశారన్నారు.
స్థానిక సంస్థల అభివృద్ధికి 14వ ఆర్థిక సంఘం చేసిన రూ.817.61కోట్లు, 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన మొత్తం రూ.6268 కోట్ల ఇంత వరకు విడుదల చేయలేదని, వాటిని తీసుకు రావాలన్నారు. పునర్విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక సహాయ గ్రాంట్ రూ.1350 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం రుణాలపై అసంబద్ధమైన, గతంలో లేని నిబంధనలు విధించడంతో తెలంగాణ తెలంగాణ రాష్ట్రం కోల్పోయిన మూలధన వ్యయం రూ.15,033 కోట్లను తీసుకురోవాలన్నారు.
ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు రూ.18వేలకోట్లు, ఏపీ ఖాతాల్లోకి తప్పుగా బదిలీ చేసిన సీఎస్ఎస్ నిధులు రూ.495 కోట్లు తీసుకురావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం బుట్టదాఖలు చేసిందని, మిషన్ భగీరథకు రూ.19205 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5,000 కోట్లు ఇవ్వాలని నీతి అయోగ్ సిఫార్సు చేసినప్పటికీ కేంద్రం ఇప్పటి వరకు నయా పైసా విడుదల చేయలేదని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లను తీసుకువచ్చి కిషన్రెడ్డి మాట్లాడాలని హితవులు పలుకుతున్నానన్నారు. బండి సంజయ్ తలా తోకా లేకుండా మాట్లాడుతున్నారని, కేంద్రం ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మారిందని, ప్రతి పౌరుడిపై రూ.1.24లక్షల అప్పు మోపిందన్నారు. ఎల్ఐసీని తెగనమ్మిందని, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మారని, ఉన్న ఉద్యోగాలను పోగాట్టారన్నారు. తెలంగాణ ఇవాళ ధాన్యాగారంగా మారిందని, పంటలు బాగా పండుతున్నాయన్నారు.