మేడ్చల్, మే9(నమస్తే తెలంగాణ): ఏదైనా గ్రామంలో పెద్ద ఎత్తున ధాన్యం ఉంటే తమకు సమాచారమిస్తే అక్కడే కాంటాలు నిర్వహిస్తామని మేడ్చల్ జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. రైతులు సమాచారమిస్తే ఆయా ఊర్లలోనే సబ్ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెబుతున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా కేంద్రాలను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మేడ్చల్ జిల్లాలో ఈ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండటంతో అన్నదాతల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది. జిల్లాలో 12 కేంద్రాల ద్వారా ఏప్రిల్ 24 నుంచి కొనుగోళ్లను ప్రారంభించారు. వరి కోతలు పూర్తయ్యేవరకు జూన్ ఆఖరి వారం దాకా ధాన్యం కొంటామని అధికారులు స్పష్టం చేశారు.