హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే బీజేపీ అసత్య ప్రచారాలు చేస్తున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. ఎనిమిదేండ్ల పాలనలో ఈ దేశ ప్రజల్లో ఏ ఒక్క వర్గానికీ చేసిన ఒక్క మంచి పనీ లేదని నిప్పులు చెరిగారు. చేసిందేమీ లేకనే వదంతులు పుట్టిస్తున్నారని మండిపడ్డారు. ఒకరు క్షుద్ర పూజలు, మరో కేంద్ర మంత్రి మూఢ నమ్మకాలు అంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాంత్రిక శక్తులన్నీ బీజేపీకే అలవాటని మండిపడ్డారు. ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్తో కలిసి టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో హరీశ్రావు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్రెడ్డి స్వార్థంతో 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం వచ్చిందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ దొడ్డిదారిన గెలవాలని చూస్తున్నదన్నారు. ఒకో నేతకు ఒకో రేటు చెల్లించి కొనుగోళ్ల పర్వానికి తెర లేపిందని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డి తన వెంట తిరిగే వారికి ఇచ్చేందుకు ఇప్పటికే 200 బ్రిజా కార్లు, 2 వేల మోటర్ బైక్లు బుక్ చేసినట్టు తమకు స్పష్టమైన సమాచారమున్నదని చెప్పారు. ఇప్పుడు మోటరు సైకిళ్లు ఇస్తున్నారని, వాటికి లొంగి భవిష్యత్తులో బీజేపీని గెలిపిస్తే రైతుల పొలాలకు మీటర్లు పెడ్తారని హెచ్చరించారు. ‘మోటర్లు ఇస్తే బతుకుతమా? మీట ర్లు పెడితే బతుకుతమా? రైతులు, మేధావులు, ఉద్యోగులు, ఉద్యమకారులు, యువకులు అం దరూ ఆలోచించాలి’ అని పిలుపునిచ్చారు. బీజే పీ చెప్పేవి నీతులు.. తవ్వేవి గోతులని దుయ్యబట్టారు. బీజేపీ మునుగోడులో చేసే అరాచకాలపై నిఘా పెడతామని, ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇది మునుగోడు ప్రజల ఆత్మ గౌరవానికి, రాజగోపాల్రెడ్డి ధనబలానికి మధ్య పోటీ అని అభివర్ణించారు.
టీఆర్ఎస్కు తెలిసింది లోక్తాంత్రిక్ విద్యనే
టీఆర్ఎస్కు తెలిసింది తాంత్రిక విద్యలు కాదని, లోక్తాంత్రిక్ (ప్రజాస్వామ్యం) విద్య మాత్రమేనని సంజయ్కు హరీశ్ చురకలంటించారు. 8 ఏండ్లుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నదని, అదే సమయంలో బీజేపీ కేంద్రంలో ఉన్నదని, ఎవరేం చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్లలో సాధ్యం కాని ఫ్లోరైడ్ సమస్యకు శాశ్వత పరిష్కారం ఇచ్చింది టీఆర్ఎస్ సర్కారేనని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు పెంచిందని, గీత, చేనేత, ఒంటరి మహిళలు, ఎయిడ్స్, బోదకాలు బాధితులు, బీడీ కార్మికులు, డయాలసిస్ పేషెంట్లకు పింఛన్లు ఇస్తూ కడుపులో పెట్టుకుని కాపాడుతున్నదని చెప్పారు. కల్యాణలక్ష్మితో ఆడబిడ్డలకు అండగా ఉంటున్నదని, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికీ బియ్యాన్ని ఇస్తున్నామని, గురుకులాల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్పారు. తెలంగాణ పథకాలను కేంద్రమే అనేకసార్లు ప్రశంసించడమే కాకుండా అవార్డులను కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.
దమ్ముంటే సిలిండర్ ధర పెంచామని చెప్పి ఓట్లడగండి
బీజేపీకి దమ్ముంటే.. రూ.400 ఉన్న సిలిండర్ ధరను రూ.1,200 చేశామని చెప్పి ఓట్లడగాలని హరీశ్రావు అన్నారు. ‘బేటీ బచావో, బేటీ పడావో నినాదమిచ్చారు తప్ప.. ఒరిగిందేమీ లేదు. మరోవైపు ఏ రకమైన దాడులు, అకృత్యాలు జరుగుతున్నాయో ప్రజలంతా చూస్తున్నారు. దేశంలో అమ్ముడు తప్ప ఏం లేదు. ఉన్న ఉద్యోగాలు ఉడబీకుతున్నారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేశారు. దేశంలో 16 లక్షల ఉద్యోగ ఖాళీలను నింపడం లేదు. ఆఖరికి దేశ రక్షణ రంగాన్నీ విడిచిపెట్టలేదు. అగ్నిపథ్ అని తీసుకొచ్చి సైనిక వ్యవస్థలోనూ కాంట్రాక్టు పద్ధతి ప్రవేశపెట్టారు’ అని ధ్వజమెత్తారు. మోదీ పాలనలో విదేశీ మారక నిల్వలు దారుణంగా పడిపోయాయన్నారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల కోసమే బీఆర్ఎస్
తెలంగాణ సాధించి ఉట్టికి ఎగిరామని, ఇపుడు దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాల అమలుచేసేందుకే బీఆర్ఎస్ పెట్టామని హరీశ్రావు తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ పెట్టిన సందర్భంలోనూ ఏవేవో విమర్శలు చేశారని, ఇప్పుడూ కూడా అంతేనని ధ్వజమెత్తారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు బర్రెలు అడ్డం వస్తే ముకలైందని, నిర్మల కూడా డొకు మాటలు మాట్లాడుతున్నారని, ఇకనైనా అవి మానుకోవాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగిప్పుడు ఏం చేశారో? గెలిస్తే ఏం చేస్తామో చెప్పే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. మునుగోడులో లెఫ్ట్ పార్టీలు చాలా ఏండ్ల వరకు ప్రాతినిధ్యం వహించాయని, ధర్మభిక్షం, రావి నారాయణరెడ్డి లాంటి వారు అక్కడినుంచి గెలిచారని గుర్తుచేశారు. కచ్చితంగా అక్కడి ప్రజలు పనిచేసే టీఆర్ఎస్కే పట్టం కడతారని ధీమా వ్యక్తంచేశారు.
నిర్మలా.. డొక్కు మాటలొద్దు..
రూపాయి విలువను చరిత్రలో ఎన్నడూ లేనంతగా దిగజార్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తన స్థాయి మరచి ఆరోపణలు చేయడం సిగ్గుచేటని హరీశ్రావు మండిపడ్డారు. గతంలోనే ఆయుష్మాన్ భారత్, కాళేశ్వరంపై అడ్డగోలు ఆరోపణలు చేశారని, ఆధారాలతో తిప్పికొట్టగానే నాలుక కరుచుకొన్నారని గుర్తుచేశారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు వంటి తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రశంసించడమే గాక, కేంద్రం కాపీ కొట్టిన సంగతేమిటని నిలదీశారు. నీళ్లు ఇవ్వకపోతే పంట ఎలా వచ్చింది? కొనలేమని ఎందుకు చేతులు ఎత్తేశారు? అని ప్రశ్నించారు. నీళ్లు, నిధు లు, నియామకాల గురించి బీజేపీ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 8 ఏండ్లలో భర్తీ చేసిన ఉద్యోగాలపై తాము శ్వేతపత్రం ప్రకటిస్తామని.. కేంద్ర ఉద్యోగాలపై మీరు ప్రకటిస్తారా? అని ఆయన సవాలు విసిరారు.
బండీ! భూతవైద్య కోర్సులో చేరు
బీజేపీ నేతలు నోరున్నది కదా అని ఆధారాలు లేకుండా నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్ర తంత్రాలతో టీఆర్ఎస్ ఎప్పుడు అధికారంలోకి రాలేదని, ప్రజా ఉద్యమాల ద్వారానే అధికారంలోకి వచ్చామని స్పష్టంచేశారు. కులమత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన రక్త చరిత్ర బీజేపీదన్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలోని బనారస్ హిందూ యూనివర్సిటీలో భూత వైద్య కోర్సును ప్రారంభించిన ఘనత బీజేపీదని ఎద్దేవా చేశారు. ఆ కోర్సుకు రూ.50 వేల ఫీజు కూడా పెట్టి, రెండేండ్లుగా కోర్సు నడుపుతున్నారంటూ దానికి సంబంధించిన సిలబస్, ప్రవేశ ప్రకటనలను హరీశ్ మీడియాకు చూపించారు. పచ్చ కామెర్లు వచ్చిన వాళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తున్నదన్న సామెత.. తాంత్రిక, భూత వైద్యం చేసే, చేపించే అలవాటున్న బీజేపీ నేతల విషయంలో నిజమైందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ కోర్సులో చేరితే మంచిదని చురకలేశారు. ‘నల్ల పిల్లులు, చేతబడులు, నిమ్మకాయలు, మిరపకాయలు అవన్నీ బీజేపీకే తెలుసు. దొంగే దొంగా దొంగా అన్న చందంగా ఉన్నది బీజేపీ తీరు. బీజేపీ నేతల వద్ద అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడానికి ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటమి భయంతోనే బండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలి’ అని హరీశ్రావు హితవు చెప్పారు.
నల్ల పిల్లులు, చేతబడులు, నిమ్మకాయలు, మిరపకాయలు అవన్నీ బీజేపీకే తెలుసు. దొంగే దొంగా దొంగా అన్న చందంగా ఉన్నది ఆ పార్టీ తీరు. బీజేపీ నేతల వద్ద అభివృద్ధి, సంక్షేమం గురించి చెప్పడానికి ఏం లేదు. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటమి భయంతోనే బండి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా చౌకబారు ఆరోపణలు మానుకోవాలి.
-మంత్రి హరీశ్రావు