హైదరాబాద్: బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదని, సచ్చేదిన్ వచ్చిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు కాషాయ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మంత్రి హరీశ్ మీడియాతో మాట్లాడారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ దశ, దిశగా మారిపోయిందని చెప్పారు. రైతుబంధు, మిషన్ భగీరథ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని వెల్లడించారు. జీఎస్డీపీలో రాష్ట్రం వృద్ధి సాధించిందని తెలిపారు. ప్లీనరీ సందర్భంగా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై చర్చిస్తామన్నారు.
పల్లెప్రగతి, పట్టణప్రగతిలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందన్నారు. పన్నెండు, పదమూడు రాష్ట్రాల నుంచి కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ఉన్న ఉత్తరప్రదేశ్ నుంచి కూడా ప్రజలు వలస వస్తున్నారని చెప్పారు.
బండి సంజయ్ పాదయాత్ర ప్రజలు లేక వెలవెలబోతున్నదని ఎద్దేవా చేశారు. డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగాయని బండి తన పాదయాత్రలో బెబుతారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ఏ రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఏది బాగుందో చూపెట్టాలన్నారు. బీజేపీ హయాంలో అచ్చేదిన్ కాదు.. సచ్చేదిన్ వచ్చిందని వెల్లడించారు. పీకే బీజేపీతో ఉంటే గొప్పోడు, మాతో ఉంటే తప్పా అని ప్రశ్నించారు. తమ పనితీరు బాగుందని, అందుకే పీకేను తీసుకున్నామని చెప్పారు.