పటాన్చెరు, నవంబర్ 26: మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కుమ్మక్కై అభ్యర్థిని పోటీలో ఉంచాయని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. అధికార టీఆర్ఎస్ను ఎదుర్కొనడం చేతకాకనే ఆ పార్టీలు కుత్రంతాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో శుక్రవారం మెదక్ స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి, ఎమ్మెల్సీ అభ్యర్థి యాదవరెడ్డితో కలసి మంత్రి పాల్గొన్నారు.
ఈసందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. కేంద్రం నుంచి న్యాయబద్ధంగా రాష్ర్టానికి రావాల్సిన నిధుల విషయంలో కోతలు విధిస్తున్నదని, ప్రజలకు ధరల వాతలు పెడుతున్నదని ధ్వజమెత్తారు. మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయని తెలిసినా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వార్థ రాజకీయాలతో అభ్యర్థిని బరిలో నిలిపాయని అన్నారు.
యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును నిలిపివేసిందని గుర్తుచేశారు. త్వరలోనే గ్యాస్బండ 1,200 చేయబోతున్నారని స్పష్టంచేశారు. రాష్ర్టాలకు కేంద్ర ఆదాయంలో వాటా ఉండదు.. కానీ, రాష్ట్ర ఆదాయాల్లో కేంద్రానికి వాటా ఉండేలా చేశారని దుయ్యబట్టారు.
14వ, 15వ ఆర్థిక సంఘం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మండల పరిషత్తులకు రూ.250 కోట్లను, జిల్లా పరిషత్తులకు రూ.250 కోట్లను కేటాయించి ఎంపీటీసీలకు న్యాయం చేసిందని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనాలు పెంచిన చరిత్ర టీఆర్ఎస్కే ఉందని స్పష్టంచేశారు. ఉద్యోగులతోపాటు గౌరవ ప్రజాప్రతినిధులకు వేతనాలు 30 శాతం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు.
కౌన్సిలర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచినా.. ఎన్నికల కోడ్ కారణంగా అలస్యంగా అందుకుంటారని చెప్పారు. బీజేపీ చేస్తున్న గోబెల్స్ ప్రచారాలను ఎవరూ నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిని ప్రజలు తిరస్కరిస్తున్నా గుర్తించడం లేదని ఎద్దేవాచేశారు.