టీబీజీకేఎస్ వినతికి స్పందించిన సీఎం, సీఎండీ
స్టార్ హోటళ్లకు తగ్గకుండా తీర్చిదిద్దిన అధికారులు
కొత్త మెనూ.. అందుబాటు ధరల్లో టిఫిన్లు, భోజనాలు
హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు
రెబ్బెన, ఏప్రిల్ 21 : బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి క్యాంటీన్లు కొత్తరూపును సంతరించుకున్నాయి. టీబీజీకేఎస్ వినతికి సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్ స్పందించి అధికారులను ఆదేశించగా, కైర్గూడ ఓసీపీ, బీపీఏవోసీపీటూలోని క్యాంటీన్లను ఆధునీకరించారు. బీపీఏవోసీపీటూలోని క్యాంటీన్కు రూ. 6 లక్షలు, కైర్గూడ ఓసీపీలోని క్యాంటీన్కు రూ. 3 లక్షలు వెచ్చించి స్టార్ హోటళ్లకు ఏమాత్రం తగ్గకుండా తీర్చిదిద్దారు. కొత్త ఫర్నిచర్, చైర్లు, టైల్స్, సీలింగ్తో పాటు దోమలు ఈగలు రాకుండా ఎలక్ట్రిక్ పరికరాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా హ్యాండ్ వాష్, స్పూన్లు క్లీన్ చేసే హీటర్లు ఏర్పాటు చేశారు. ఆహ్లాదంకోసం చుట్టూ పచ్చని చెట్లు పెంచారు.
కొత్త మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనం
క్యాంటీన్లలో కొత్త మెనూ ప్రకారం టిఫిన్లు, భోజనం అందిస్తుండగా, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఇడ్లీ, టీ, కాఫీ, బాదుషా, కారా, భోజనం, మంగళవారం పూరి, పప్పు, సమోసా, భోజనం, ఆలు కూర్మ, బుధవారం మినప వడ, మిర్చి, భోజనం, గురువారం ఉప్మా, పకోడి, భోజనం, శుక్రవారం సాంబార్ ఇడ్లీ, లడ్డూ, కారా, భోజనం, శనివారం పూరి, పప్పు, ఆలు కూర్మ, మైసూర్ పాక్, భోజనం, ఆదివారం చపాతి, ఆలు కూర్మ, మిర్చివంటివి అందిస్తున్నారు.
టిఫిన్లు, భోజనాల ధరలు
ఏరియాలోని బీపీఏఓసీపీటూ, కైర్గూడ ఓసీపీలోని క్యాంటీన్లను ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నారు. ఇక్కడ ఫ్లేట్ భోజనం రూ. 15, ఫుల్ భోజనం రూ. 20, ఉప్మా (గరిటె), ఇడ్లీ, వడ, పూరి ఒక్కో దానికి రూపాయి చొప్పున తీసుకుంటున్నారు. ఇక కైర్గూడ క్యాంటీన్లో భోజనం రూ. 15, పూరి, ఇడ్లీ, వడ, బోండా, మిర్చి ఒక్కోదానికి రూపాయి తీసుకుంటున్నారు. 25 గ్రాముల లడ్డూకు రూ. 3.50, 35 గ్రాముల బాదూషాకు రూ. 3.50, చపాతి కర్రీతో కలిపి రూ. 5, 20గ్రాముల కారా-బోందీ రూ. 2, టీకి రూపాయి, కాఫీకి రూ. 2 చొప్పున తీసుకుంటున్నారు.
ఆధునీకరించడం బాగుంది
సీఎం కేసీఆర్, సీఎండీ శ్రీధర్ చొరవతో ఏరియాలోని సింగరేణి క్యాంటీన్లను ఆధునీకరించడం బాగుంది. కొత్త మెనూ ప్రకారం టీ, టిఫిన్, భోజనం అందిస్తున్నారు. చాలా తక్కువ ధరకే వాటిని అందిస్తున్నారు.
టీబీజీకేఎస్ కృషితోనే..
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నది. క్యాంటీన్లు ఆధునీకరించి, మంచి టిఫిన్, భోజనం అందిస్తామన్న హామీ కూడా నెరవేర్చారు. టీబీజీకేఎస్ కృషితోనే ఇది సాధ్యమైంది.