సిటీబ్యూరో/మేడ్చల్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ బుధవారం ఈ వేడుకలను నిర్వహించనున్నారు. గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద చేసిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్వేతమహాంతి మంగళవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఇక మేడ్చల్లోని కలెక్టరేట్లో నిర్వహించే వేడుకలకు ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆమె అన్నారు. కరోనా నేపథ్యంలో వేడుకలకు హాజరయ్యే వారు మాస్కులతో పాటు భౌతిక దూరం పాటించాలని కోరారు.
సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం కేసీఆర్ గన్పార్క్ దగ్గర అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు గన్పార్క్ వద్ద ట్రాఫిక్ వద్ద ఆంక్షలు విధించారు. రాజ్భవన్ రోడ్డు- పీవీ విగ్రహం-ఖైరతాబాద్-నిరంకరి – పాత సైఫాబాద్ పీఎస్-రవీంద్రభారతి జంక్షన్-బషీర్బాగ్ జంక్షన్-ఏఆర్ పెట్రోలు బంక్ నాంపల్లి రోడ్డు-తాజ్ ఐలాండ్ మార్గంలో సీఎం ప్రయాణించనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని అదనపు పోలీసు కమిషనర్ అనిల్కుమార్ విజ్ఞప్తి చేశారు.