హైదరాబాద్: కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్దళ్ అధినేత (ఆర్ఎల్డీ) అజిత్ సింగ్ మరణం పట్ల మంత్రి హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ‘ఆర్ఎల్డీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ గారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’ అని మంత్రి హరీశ్ ట్వీట్ చేశారు.
మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ కుమారుడైన అజిత్ సింగ్.. కరోనాతో కన్నుమూశారు. 82 ఏండ్ల అజిత్ సింగ్ ఏప్రిల్ 22న కరోనా బారినపడ్డారు. అప్పటినుంచి గురుగ్రామ్లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. అయితే ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ కారణంగా మంగళవారం రాత్రి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుది శ్వాసవిడిచారు. ఏడుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి