హైదరాబాద్ : రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ కోసం రూ. 259,51,42,842 ఖర్లు చేశామని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ పథకాన్ని రాష్ట్రంలో ఈ ఏడాది మే 18 నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య శ్రీ పథకంపై అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు సమాధానం ఇచ్చారు.
2014-21 వరకు పది లక్షల 39 వేల 86 మంది ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందారు అని హరీశ్రావు చెప్పారు. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని జనాభాలో తక్కువ మందికి మాత్రమే లాభం కలుగుతుంది. 26 లక్షల 11 వేల కుటుంబాలకు మాత్రమే వైద్య సేవలు అందుతాయి. ఇక 87 లక్షల 50 వేల కుటుంబాలకు ఆరోగ్య శ్రీకింద వైద్య సేవలు అందుతాయి. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే 60 లక్షల కుటుంబాలకు వైద్య సేవలు దూరం అవుతాయి. అందుకు ఈ పథకంలో చేరవద్దని అనుకున్నాం. కొన్ని కేసులు ఆరోగ్య శ్రీలో కవర్ కానివి… ఆయుష్మాన్ భారత్ కింద కవర్ అయ్యాయి. విసృత ప్రయోజనాల రీత్యా ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య శ్రీ కలిపి అమలు చేస్తున్నాం. సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో ఆయుష్మాన్ భారత్ కింద రాని కేసులకు అయ్యే మొత్తాన్ని కలిపి అమలు చేసేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఇప్పటి వరకు ఆయుష్మాన్ భారత్ కింద 1 లక్ష 18 వేల 247 మందికి వైద్య సేవలు అందాయి. ఇందు కోసం రూ. 259 కోట్ల 51లక్షల 42 వేల 842 ఖర్చు చేశాం. ఈ పథకాన్ని మే 18 నుంచి అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్యం ద్వారానే కరోనా వైరస్ను ఎదుర్కొన్నాం. వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ బారిన పడ్డ వారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందారు. ప్రభుత్వ రంగంలోనే అత్యాధునిక సౌకర్యాలు కల్పించి కరోనా వైద్య సేవలు అందిస్తున్నాం అని మంత్రి హరీశ్రావు తెలిపారు.