చేర్యాల, జూన్ 4 : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనల మేరకు మల్లన్న క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి అన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి క్షేత్రాన్ని సమగ్రాభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రతిపాదనలను ఆలయ అధికారులతో కలిసి కొత్తగా నియామకమైన ధర్మకర్తల మండలి తయారు చేసింది. శుక్రవారం మల్లన్న ఆలయంలోని ధర్మకర్తల మండలి కార్యాలయంలో ఆలయ చైర్మన్ అధ్యక్షతన ధర్మకర్తల మండలి మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మల్లన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు 12 తీర్మానాలను చైర్మన్ ప్రవేశపెట్టడడంతో ధర్మకర్తలు వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని నూతనంగా మూడు క్యూలైన్లను ఏర్పాటు చేయాలని తీర్మానించామని తెలిపారు.
జగోపురం పక్కనే ఉన్న ప్రైవేట్ వ్యక్తుల భవనాలను తొలగించి వాటి స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న విధంగా అధునాతన గ్యాలరీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందులో టాయిలెట్స్తోపాటు ఫ్యాన్లు, తాగునీరు తదితర వసతులు కల్పిస్తామని తెలిపారు. డోనర్ స్కీంలో కేతమ్మ బ్లాక్ ప్రదేశంలో శిథిలావస్థలో ఉన్న గదులను తొలగించి వాటి స్థానంలో కొత్తగా 75 కాటేజీలను నిర్మిస్తామన్నారు. మల్లన్నగుట్ట సర్వే నెం.199, శిఖం సర్వే నెం.198లోని రోడ్డు మార్గాన్ని వెడుల్పు చేయడంతోపాటు సుందరీకరిస్తామని తెలిపారు. దేవస్థానంలోని మల్లికార్జున, మేడలమ్మ, కేతమ్మ బ్లాకులలోని గదులకు మరమ్మతులు చేయడంతోపాటు వాటర్ సైప్లె, విద్యుత్ సరఫరా, ఫ్యాన్లు ఏర్పాటు చేయడంతోపాటు 10 గదులను ఏసీ గదులుగా మారుస్తామన్నారు.
మల్లన్న క్షేత్రంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం, అన్నదాన సత్రం లో వాటర్ప్లాంట్ ఏర్పాటు చేయడం, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రహరీ నుంచి పోలీస్ విగ్రహం మీదుగా నర్సింగరావు భవనం వరకు, చేర్యాల, ఐనాపూర్ వెళ్లే దారిలో షెటర్లను నిర్మిస్తామని చెప్పారు. ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం వద్ద బుకింగ్ కార్యాలయం, నివేదన శాల, ప్రసాద శాల, కొబ్బరికాయల దుకాణం, కూల్డ్రింక్స్ షాపుల నిమిత్తం తాత్కాలికంగా రేకుల షెడ్లు నిర్మిస్తామని తెలిపారు. సమావేశంలో ఆలయ ధర్మకర్తలు ఉత్కూరి అమర్, ముత్యం నర్సింహులు, తాళ్లపల్లి శ్రీనివాస్, తివారీ దినేశ్, చింతల పరశురాములు, బొంగు నాగిరెడ్డి, పొతుగంటి కొమురవెల్లి, గడ్డం మహేశ్యాదవ్, కొంగరి గిరిధర్, బొంగు నాగిరెడ్డి, శెట్టె ఐలయ్యతో పాటు ఏఈవో వైరాగ్యం అంజయ్య, ప్రధానార్చకుడు మల్లికార్జున్, సూపరింటెండెంట్ నీల శేఖర్ పాల్గొన్నారు.