తిరువనంతపురం: ఇటీవల వెల్లడైన కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) వరుసగా రెండోసారి ఘన విజయం సాధించి రికార్డు నెలకొల్పింది. దాంతో మరోసారి పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతారనే విషయం స్పష్టమైంది. అయితే మంత్రిత్వ శాఖల కేటాయింపు, ప్రభుత్వ ఏర్పాటు ముహూర్తం, ప్రమాణ స్వీకార తేదీ తదితర అంశాలపై కూటిమిలోని అన్ని పార్టీలు భేటీ అయి చర్చించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రెండు వారాల్లో కూటమిలోని అన్ని పార్టీలతో చర్చలు జరిపి మే 17న ఎల్టీఎఫ్ తుది సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఆ కూటమి కన్వీనర్, సీపీఎం యాక్టింగ్ స్టేట్ సెక్రెటరీ ఏ విజయరాఘవన్ తెలిపారు. మే 17న జరిగే సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకార తేదీలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు.