కరీంనగర్ : దేశంలో ఎక్కడా లేని విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ర్టం తెలంగాణ మాత్రమే అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొంటామని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు అధైర్య పడొద్దు.. ఆందోళన చెందొద్దు. ఆలస్యమైనా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
మిల్లింగ్ విషయంలో కొంత జాప్యం జరుగుతోందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ర్ట వ్యాప్తంగా 46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి రోజు లక్ష నుంచి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చివరి వరకు 80 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందన్నారు. జూన్ మొదటి వారంలోగా ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తాం అని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.