హైదరాబాద్ : రాష్ర్టంలోని రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం తడిసినప్పటికీ, ఆ ధాన్యాన్ని సేకరిస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణపై ఇప్పటికే కలెక్టర్లు, అదనపు కలెక్టర్లను అప్రమత్తం చేయడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం అని స్పష్టం చేశారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దు, అధైర్య పడవద్దు, తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాల అండగా నిలుస్తోందన్నారు. ఇది రైతు ప్రభుత్వమని, రైతాంగ సమస్యల పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు.
ఈ యాసంగిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకోవడానికి భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) అంగీకరించింది అని తెలిపారు. అంతకు మించి వచ్చినా కూడా కొనుగోలు చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.40 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,740 కోట్ల విలువ చేసే 19.83 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోళ్ల కోసం 7,183 కేంద్రాలను ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ, ఇప్పటి వరకు 6,144 కేంద్రాలను ప్రారంభించామని గుర్తు చేశారు.
ధాన్యం కొనుగోళ్లకు నిధుల సమస్యగానీ, గన్నీ సంచుల సమస్యగానీ లేదని, తెలంగాణ రైతాంగానికి పూర్తి అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలుస్తుందని, కోవిడ్ క్లిష్ట సమయంలోనూ క్షేత్ర స్థాయిలో పౌరసరఫరాల సిబ్బంది నిరంతరం అందుబాటులోనే ఉంటారని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.