హుజూరాబాద్/హుజూరాబాద్ టౌన్ ఆగస్టు 5: హుజూరాబాద్ పట్టణంలోని వడ్డెరకాలనీ వాసులు టీఆర్ఎస్కు జైకొట్టారు. గురువారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని వడ్డెర కాలనీ, కిందివాడ, తెనుగువాడల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పర్యటించారు. పర్యటన తర్వాత సమావేశమైన వడ్డెరకాలనీ వాసులు టీఆర్ఎస్కు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వారు తీర్మాన ప్రతిని మంత్రికి వాట్సాప్లో పంపించారు. అంతకుముందు మంత్రి ఆయా కాలనీల్లో పర్యటించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికుల కోరిక మేరకు వడ్డెరకాలనీలో మహిళా సంఘ భవనం, అంగన్వాడీ కేంద్రాలకు వెంటనే రూ.20 లక్షలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి రూ.30 లక్షలు, చిలుకవాగుపై వంతెనకు రూ.కోటి మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కాకతీయ కాలువ పక్కన జర్నలిస్టుల కాలనీ కోసం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి గంగుల భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్ నియోజక వర్గానికి ఈటల రాజేందర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. తన పరపతిని, ఆస్తులు పెంచుకునేందుకు మాత్రమే ఆరాటం పడ్డాడు తప్పా గెలిపించిన ప్రజల కష్టసుఖాలను ఏనాడూ పట్టించుకోలేని మండిపడ్డారు.