కరీంనగర్ కార్పొరేషన్, మే 24: టీఆర్ఎస్ జెండాపై, కేసీఆర్ బొమ్మతో గెలిచిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులెవరూ అమ్ముడుపోరని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గం తనవైపే ఉన్నదని, తమ వాళ్లను బెదిరిస్తున్నారని, భయపెడుతున్నారని, కొనుగోలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సోమవారం కరీంనగర్లో మంత్రి గంగులను కలిశారు. ఈ సందర్భంగా గంగుల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఎవరూ అమ్ముడుపోరన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపాలిటీల చైర్మన్లు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లలో 95 శాతం టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కేసీఆర్ వెంటే ఉన్నారని తేల్చిచెప్పారు. రానున్న రోజుల్లో హుజూరాబాద్ నియోజక వర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు. సోషల్ మీడియాల్లో ఇబ్బందికర పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.
మేమంతా కేసీఆర్ వెంటే..
టీఆర్ఎస్లో ఉద్యమ సమయం నుంచి ఉన్నామని, తామంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు స్పష్టంచేశారు. హుజూరాబాద్ జడ్పీటీసీ పడిదం బక్కారెడ్డి, వీణవంక జడ్పీటీసీ మాడ వనమాల, వీణవంక ఎంపీపీ ముసిపట్ల రేణుక, హుజూరాబాద్ ఇరుమల్ల రాణి తదితరులు సోమవారం మంత్రి గంగులను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ కండువాతోనే తాము గెలిచామన్నారు. తాము ప్రలోభాలకు లొంగిపోయే వాళ్లం కాదని, పార్టీని నమ్ముకొని పని చేస్తున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు.