రైతుల ఆర్థికాభివృద్ధికే వేదికలు
అంకాపూర్లా అన్ని గ్రామాలు ఎదుగాలి
కాళేశ్వరంతో ప్రతి ఎకరాకు సాగునీరు
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్
వీణవంక, జమ్మికుంట మండలాల్లో పర్యటన
రైతు వేదికలు, అభివృద్ధి పనులు ప్రారంభం
వీణవంక/ జమ్మికుంట రూరల్, మార్చి 21: దేశమే గర్వపడే విధంగా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఉద్ఘాటించారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, కాళేశ్వరం జలాలతో సాగువిస్తీర్ణం పెరిగి దేశానికి అన్నంపెట్టేస్థాయికి ఎదిగిందన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకే సర్కారు పల్లె ప్రగతికి శ్రీకారం చుట్టిందని చెప్పారు. వీణవంక మండలంలోని వల్భాపూర్, వీణవంక, రెడ్డిపల్లిలో రైతు వేదికలు, కొండపాకలో వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, డంప్యార్డ్, జమ్మికుంట మండలం గుండ్రపల్లిలో వైకుంఠధామాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఆయాచోట్ల మాట్లాడారు. ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసి సకల సౌకర్యాలతో రైతు వేదికలు నిర్మించిందన్నారు. ఆర్బీఎస్ కోఆర్డినేటర్లు, ఏఈవోలు రైతులకు అన్నివేళలా అందుబాటులో ఉండాలని సూచించారు. అన్నదాతలు కలిసికట్టుగా వ్యవసాయం చేసి అంకాపూర్లా అభివృద్ధి సాధించాలని అభిలషించారు. సహకార సంఘాల్లో 30 వేల మందికి సభ్యత్వాలు ఇప్పించి పాడి గేదెలు అందజేస్తామన్నారు. ప్రజల కన్నీళ్లు తుడిచేవాడే నాయకుడవుతాడని పేర్కొన్నారు. గ్రామాల్లో భర్తలు చనిపోయిన వారికి, దిక్కులేని వారికి ఆర్థికంగా అండగా నిలబడతామని భరోసానిచ్చారు. రైతాంగం మేలు తలంచే మానేరు, వీణవంక వాగులపై ఏడు చెక్డ్యాంలు నిర్మించామన్నారు. అనంతరం మండలంలోని 18 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ. ఎంపీపీ ముసిపట్ల రేణుక, జడ్పీటీసీ మాడ వనమాల, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కొమురయ్య, ఏఎంసీ చైర్మన్ బాలకిషన్రావు, పీఏసీఎస్ చైర్మన్ విజయభాస్కర్రెడ్డి, వైస్ఎంపీపీ లత, సర్పంచులు రఘుపాల్రెడ్డి, పోతుల నర్సయ్య, ఆవాల అరుంధతి, ఆర్బీఎస్ కోఆర్డినేటర్లు చాడ రాజేందర్రెడ్డి, కట్ట రాజయ్య, శ్రీనివాస్, నేతలు ముసిపట్ల తిరుపతిరెడ్డి, సాదవరెడ్డి, మోటం వెంకటేశ్, దాసారపు రాజు ఉన్నారు. జమ్మికుంటలో కేడీసీసీ వైస్ చైర్మన్ పింగళి రమేశ్, తుమ్మేటి సమ్మిరెడ్డి, జమ్మికుంట జడ్పీటీసీ శ్రీరామ్ శ్యాం, గుండ్రపల్లి సర్పంచ్ బలుగూరి పద్మా సమ్మారావు, ఉప సర్పంచ్ రావుల స్వరూప ఉన్నారు.