లండన్ : ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్న కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు నివేదికలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై యురోపియన్ యూనియన్ వైద్య నియంత్రణ సంస్థ ఓ ప్రకటన చేసింది. రక్తం గడ్డకట్టడం అనేది అత్యంత అరుదుగా నమోదు అయ్యే సైడ్ ఎఫెక్ట్ అని మెడిసిన్స్ రెగ్యులేటర్ పేర్కొన్నది. 86 కేసులను పరిశీలించిన యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఆ అధ్యయన నివేదికను వెల్లడించింది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నష్టాల కన్నా ఎక్కువ లాభాలు ఉన్నట్లు పేర్కొన్నది. ఇప్పటి వరకు యూరోప్ దేశాల్లో సుమారు 2.5 కోట్ల మందికి ఆస్ట్రాజెనికా టీకా వేశారు. బ్లడ్ క్లాటింగ్ జరిగిన కేసుల్లో ఎక్కువ శాతం మంది 60 ఏళ్ల లోపు మహిళలే ఉన్నట్లు ఈఎంఏ పేర్కొన్నది. 30 ఏళ్ల లోపు వారికి బ్రిటన్ ప్రభుత్వం ఆస్ట్రాజెనికా బదులుగా మరో టీకాను ఇవ్వనున్నది. మార్చి నెల చివరి నాటికి బ్రిటన్లో 79 మందికి బ్లడ్ క్లాటింగ్ లక్షణాలు కనిపించాయి. దాంట్లో 19 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల మంది ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నారని, బ్లడ్ క్లాట్ కేసులను అత్యంత అరుదైనవిగా గుర్తిస్తున్నామని ఈఎంఏ తెలిపింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ 13 కోట్ల మందికి సంక్రమించింది. 28 లక్షల మంది మరణించారు.
ఇదీ నివేదిక
ఈఎంఏ కమిటీ ఓ హెచ్చరిక కూడా చేసింది. ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో రెండు వారాల్లోగా రక్తంలోని ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా పడిపోతుందని వెల్లడించింది. ఈ అంశం పట్ల ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటి వరకు బ్లడ్ క్లాటింగ్ కేసులు ఎక్కువగా 60 ఏళ్ల లోపు ఆడవారిలో నమోదు అయ్యాయని, ప్రస్తుతం ఉన్న ఆధారాల ప్రకారం ఇతర సైడ్ఎఫెక్ట్స్ ఏమీ లేవని ఈఎంఏ చెప్పింది. ఒకవేళ ఆస్ట్రాజెనికా టీకా తీసుకున్నవారిలో ప్లేట్ లెట్స్ తగ్గినట్లు గుర్తిస్తే, వాళ్లు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని కూడా ఈఎంఏ సూచన చేసింది. మెదడులో ఉండే సిరలు(వెయిన్స్, సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్), ఉదరం(స్పాంచ్నిక్ వీన్ థ్రాంబోసిస్), ధమనుల్లో పలు చోట్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నదని ఈఎంఏ కమిటీ పేర్కొన్నది. సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిన్కు చెందిన 62 కేసులను, స్పాన్చిక్ వీన్ థ్రాంబోసిస్కు చెందిన 24 కేసులను పరిశీలించారు.