హైదరాబాద్ : పంచాయితీ నిధుల ఆడిట్ లో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా నిలిచిందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించిన విషయం విదితమే. ఈ సందర్భంగా కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్దేనని, ఆయన దార్శనికత వల్లే దేశంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తున్నదని అన్నారు. అభినందనలు, అవార్డులేనా?నిధులు కూడా ఇవ్వండి అంటూ ఆయన కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాల పంచాయతీ రాజ్ శాఖ ఆర్థిక, ఆడిట్ విభాగాల అధికారులతో కేంద్ర మంత్రి తోమర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను అభినందించారు. నిధుల దుర్వినియోగం జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ ఆడిటింగ్ను ప్రశంసించారు. మరోవైపు కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అయితే, తెలంగాణ రాష్ట్రం అవలంభిస్తున్న ఆన్లైన్ ఆడిట్ విధానం దేశానికి ఆదర్శం అని అభినందించినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ రూపొందించిన పల్లె ప్రగతి, హరిత హారం, రైతు బంధు, ధాన్యం కొనుగోలు వంటి అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవు అన్నారు. ఈజీఎస్ లాంటి కేంద్ర పథకాల అమలులోనూ దేశంలో తెలంగాణ నెంబర్వన్గా ఉందన్నారు. ఆయా పథకాలు రాష్ట్రాన్ని అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిలుపుతున్నాయని చెప్పారు.
ఇప్పటికే కేంద్రం, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు అనేక అవార్డులు ఇచ్చిందని, ప్రశంసలు కురిపిస్తూనే ఉందన్నారు. కేవలం అవార్డులు, రివార్డులు మాత్రమే కాకుండా, ప్రోత్సాహకంగా రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించాలని, రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ఎర్రబెల్లి కేంద్రాన్ని కోరారు. ఈ అవార్డులు,రివార్డులు ప్రశంసలు రావడానికి కృషి చేస్తున్న సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తనియా, కమిషనర్ రఘునందన్ రావు, ఆన్లైన్ ఆడిటింగ్ అధికారులు, సర్పంచ్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు, సిబ్బందికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందనలు తెలిపారు.